కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు సంబంధించి ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. చంచల్గూడ జైల్లో వున్న ఎన్ఎస్యూఐ నేతలను కలిసేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఇప్పటికే ఓయూలో రాహుల్ టూర్కు ప్రభుత్వం, హైకోర్టు పర్మిషన్ ఇవ్వని సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా చంచల్గూడ జైల్లో (chanchalguda jail) వున్న ఎన్ఎస్యూఐ (nsui) నేతలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని టీపీసీసీ చేసుకున్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ అనుమతి నిరాకరించారు.
అంతకుముందు చంచల్గౌడ జైల్లో వున్న విద్యార్ధి నాయకులను రాహుల్ గాంధీ (rahul gandhi) కలిసేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ లా అండ్ ఆర్డర్ డీజీపీని గురువారం టీ.కాంగ్రెస్ (congress) నేతలు కలిశారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో లా అండ్ ఆర్డర్ డీజీనీ కలిశారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న రాహుల్ గాంధీకి ఓయూలో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోరేందుకే విద్యార్ధి నేతలు వెళ్లారని చెప్పారు. అనుమతి ఇవ్వకపోతే పర్వాలేదని.. కానీ అక్రమ కేసులు పెట్టి బల్మూర్ వెంకట్ సహా 18 మంది విద్యార్ధి నేతలను నిర్బంధించారని రేవంత్ ఆరోపించారు.
చంచల్గూడ జైలులో వున్న విద్యార్ధులను పరామర్శించాలని రాహుల్ను తాము కోరామని .. దీనికి ఆయన సమ్మతించారని రేవంత్ చెప్పారు. విద్యార్ధులకు భరోసా ఇచ్చేందుకు చంచల్గూడలో రాహుల్ గాంధీ పర్యటించాలని భావించారని ఆయన పేర్కొన్నారు. మే 7న రాహుల్ చంచల్గూడ జైలుకు వస్తారని.. ఇందుకు అనుమతి ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్ను కోరామన్నారు. కానీ అందుకు ఆయన అనుమతి ఇవ్వకపోగా.. జైళ్ల శాఖ డీజీని కలవాలని సూచించారని రేవంత్ వెల్లడించారు.
75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంత నిరంకుశంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వాలు లేవని ఆయన దుయ్యబట్టారు. మరణశిక్షపడ్డ ఖైదీలను కూడా వాళ్ల సంబంధీకులు కలిసేందుకు అనుమతులు దొరుకుతాయని రేవంత్ చెప్పారు. అలాంటిది ఇక్కడ విద్యార్ధులపై అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడితే.. వారిని పరామర్శించాలని రాహుల్, మాణిక్యం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు భావించారని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై ఎందుకు ఒత్తిడి తీసుకొచ్చి.. ములాఖత్లకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని రేవంత్ ప్రశ్నించారు. 18 మంది ఎన్ఎస్యూఐ విద్యార్ధులను 50 మంది ఒకేసారి కలిసే అవకాశం వుందని చెప్పారు.
