విపక్షాలపై గవర్నర్ మండిపాటు

హైదరాబాద్‌: తాను పూజకు వెళ్ళినా విపక్షాలు తనపై విమర్శలు చేస్తున్నాయని తెలంగాణ గవర్నర్ నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు. విపక్షాలే కాదు ఎవరేమన్నా తాను పట్టించుకోనని ఆయన తేల్చి చెప్పారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గురువారం నాడు గవర్నర్ నరసింహన్ నారాయణగూడలోని డయాగ్నసిస్ సెంటర్‌ను పరిశీలించారు. అన్ని రకాల పరీక్షలను ఒకేచోట నిర్వహించి 24 గంటల్లోనే ఫలితాలను ఇచ్చే కేంద్రం ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయమని ఆయన చెప్పారు.

ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి కృషి జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. చెప్పి చేసినా చెప్పక చేసినా తనపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరేమనుకొన్నా తాను పట్టించుకోనని గవర్నర్ తేల్చి చెప్పారు. 

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులను తాను గతంలోనే వ్యక్తిగతంగా పరిశీలించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎవరో ఏదో చెబితే తాను నమ్మనని ఆయన చెప్పారు. 


అన్నీ విషయాలను తాను స్వయంగా తెలుసుకొనేందుకు ప్రయత్నం చేస్తానని గవర్నర్ చెప్పారు.ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన చెప్పారు. మోడల్ హెల్త్‌ సెంటర్ గా తెలంగాణ అభివృద్ది చెందుతోందన్నారు.