బడ్జెట్ సమావేశాల్లో  గవర్నర్ ప్రసంగం  ఉంటుందని  ప్రభుత్వ  తరపు లాయర్  ఇవాళ హైకోర్టుకు తెలిపారు. 

 హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంతోనే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ తరపున న్యాయవాది సోమవారం నాడు హైకోర్టుకు తెలిపారు. మరో వైపు హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభం కానున్నట్టుగా ప్రబుత్వ తరపు న్యాయవాది దుశ్వంత్ ధవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్ ను విమర్శించవద్దనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ధవే ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాదు లంచ్ మోషన్ పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్టుగా కూడ ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.

తెలంగాణ బడ్జెట్ ను గవర్నర్ ఆమోదించడం లేదని ఇవాళ హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇవాళ ఉదయం వాడీ వేడీగా వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున దుశ్వంత్ ధవే వాదనలు విన్పించారు. 

రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగిన సమయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని ప్రభుత్వ తరపు న్యాయవాది ధవే చెప్పారు. అంతేకాదు ఈ విషయమై పలు సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందా అని రాజ్ భవన్ వర్గాలు తెలంగాణ ఆర్ధిక శాఖ కార్యదర్శిని అడిగినట్టుగా హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు ధవే. దీంతో లంచ్ బ్రేక్ కోసం కోర్టు వాయిదా పడింది. మధ్యాహ్నం రెండున్నర గంలకు ఈ విషయమై విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. లంచ్ బ్రేక్ సమయంలో గవర్నర్ తరపు న్యాయవాది ఆశోక్ రాంపాల్, ప్రభుత్వ తరపు న్యాయవాది సమావేశమయ్యారు. గవర్నర్ పై మంత్రులు , బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడంపై చర్చించారు.

రాజ్యాంగబద్దంగా ఇది సరైంది కాదని గవర్నర్ తరపు న్యాయవాది ఆశోక్ అభిప్రాయపడ్డారు. గత కొంత కాలంగా చోటు చేసుకున్న ఘటనలపై చర్చించారు.

రాజ్యాంగబద్దంగా తాము వ్యవహరిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది ధవే గవర్నర్ తరపు న్యాయవాదికి చెప్పారు. ప్రభుత్వం తరపు న్యాయవాది ధవే, గవర్నర్ తరపు న్యాయవాది మధ్య సయోధ్య కుదిరింది. హైకోర్టులో వాదనలు ప్రారంభమైన తర్వాత ఈ విషయాన్ని ప్రభుత్వం తరపు న్యాయవాది ధవే ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. మరో వైపు తాము దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్టుగా ధవే హైకోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్ ను విచారణను ముగిస్తున్నట్టుగా హైకోర్టు తెలిపింది. రాజ్యాంగబద్దంగా తాము వ్యవహరిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది ధవే గవర్నర్ తరపు న్యాయవాదికి చెప్పారు.

వచ్చే నెల 3వ తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. బడ్జెట్ కు సంబంధించి కసరత్తును కూడా కొంత కాలం క్రితమే ప్రారంభించింది. ముసాయిదా బడ్జెట్ ను గవర్నర్ ఆమోదించలేదని ఇవాళ హైకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది.

గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించారు. అయితే ఈ దఫా కూడా అదే పద్దతిని అవలంభించే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగింది. బడ్జెట్ ను ఆమోదించలేదని ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. లంచ్ బ్రేక్ సమయంలో ఇరు వర్గాలకు చెందిన న్యాయవాదులు చర్చించుకున్నారు. తమ మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు న్యాయవాదులు చేరవేశారు. ఇదే విషయాన్ని ఇరు వర్గాల న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు.