గుడ్న్యూస్: ఎల్ఆర్ఎస్ కి ఫీజు తగ్గింపు, 2015 జీవో ప్రకారంగా వసూలు
రాష్ట్ర వ్యాప్తంగా స్థలాల క్రమబద్దీకరణ కోసం జారీ చేసిన 131 జీవోలో సవరణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు గురువారం నాడు సవరణ జీవోను జారీ చేసింది.
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా స్థలాల క్రమబద్దీకరణ కోసం జారీ చేసిన 131 జీవోలో సవరణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు గురువారం నాడు సవరణ జీవోను జారీ చేసింది.
స్థలాల క్రమబద్దీకరణ కోసం ఈ ఏడాది ఆగష్టు 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 131 జీవోను జారీ చేసింది.ఈ జీవోపై విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. పేదల నుండి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే ఉద్దేశ్యంతోనే ఈ జీవోను తీసుకొచ్చారని విపక్షాలు విమర్శలు గుప్పించాయి.
also read:131 జీవోపై విచారణ: ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
దీంతో ఎల్ఆర్ఎస్ లో సవరణలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు ఈ నెల 16వ తేదీన అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.దీంతో సవరణ జీవోను గురువారం నాడు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 2015లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎల్ఆర్ఎస్ జీవో 151 ప్రకారంగా క్రమబద్దీకరణ కోసం ఫీజులు వసూలు చేస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
2015 ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో వసూలు చేసినట్టుగానే ఈ దఫా కూడ ఛార్జీలను వసూలు చేయనున్నారు.స్లాబ్ లను పెంచి ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
గజానికి 3 వేలలోపు రూపాయాలు మార్కెట్ విలువ ఉంటే రెగ్యులరైజేషన్ కోసం 20 శాతం వసూలు చేస్తారు. రూ. 3001 నుండి రూ.5000లోపు ఉంటే 30 శాతం, రూ. 5001 నుండి 10,000లోపు ఉంటే 40 శాతం, 10,001 నుండి రూ. 20,000లోపు ఉంటే 50 శాతం, రూ. 20,001 నుండి రూ.30,001 లోపు ఉంటే 60 శాతం, రూ.30,001 నుండి రూ.50,001 లోపు ఉంటే 80 శాతం, రూ. 50 వేలకు పైగా ఉంటే 100 శాతం రెగ్యులరైజేషన్ ఛార్జీలను వసూలు చేయనున్నారు.