స్ట్రెయిన్ ఎఫెక్ట్: 1 నుండి 5 తరగతుల విద్యార్ధుల ప్రమోట్కు తెలంగాణ సర్కార్ ప్లాన్
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాలని తెలంగాణ విద్యాశాఖ యోచిస్తోంది.
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాలని తెలంగాణ విద్యాశాఖ యోచిస్తోంది.
కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పాఠశాలలను ప్రారంభించలేదు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా కేసులు నమోదు కాకుండా వైద్య శాఖాధికారులు చర్యలు తీసుకొంటున్నారు. కరోనా నేపథ్యంలో అధికారులు ప్రజలకు పలు సూచనలు చేసింది.
ఇదే తరుణంలో కరోనా రెండో రకం వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. బ్రిటన్ నుండి తెలంగాణకు ఇప్పటికే సుమారు 3 వేల మంది వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. వీరిని గుర్తించి శాంపిల్స్ సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
కరోనా సెకండ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో 1 నుండి 5వ తరగతుల వరకు విద్యార్ధులను ప్రమోట్ చేయాలని తెలంగాణ విద్యాశాఖ భావిస్తోంది. ఇప్పటికే స్కూల్స్ ను ఓపెన్ చేయలేదు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో స్కూల్స్ ఇప్పుడే తెరిచే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఐదు తరగతుల వరకు విద్యార్ధులను ప్రమోట్ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకొంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గత ఏడాది 10వ తరగతి విద్యార్ధులను తెలంగాణ ప్రభుత్వం ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.