ఆలస్యంగా కదిలిన తెలంగాణ సర్కారు
బోరుబావుల ఘటనలు లెక్కకు మించి జరుగుతున్నాయి. తెలంగాణ సర్కారు మాత్రం ఇప్పుడు కదిలింది. చేవెళ్ల చిన్నారి మీనా మరణం తర్వాత బోరుబావుల మూసివేతపై అధికారులకు ఆదేశాలిచ్చింది. ఏదో సంఘటన జరిగినప్పుడు స్పందించడం తర్వాత వదిలేయడం వల్ల ప్రయోజనం ఉండదని జనాలు అంటున్నారు. నిరంతరంగా దీనిపై నిఘా ఉంటేనే ఫలితాలు వస్తాయంటున్నారు.
ఎట్టకేలకు తెలంగాణ సర్కారు కదిలింది. పనిచేయని బోర్ వెల్స్ ను తక్షణమే మూసివేయాలని అధికారులను ఆదేశించింది. పనిచేయని బోర్వెల్స్ గుంతలను జులై 10 లోపు పూడ్చివేయాలని...లేని పక్షంలో కేసులు నమోదు చేయడంతో పాటు భారీగా జరిమానా విధించాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.
సచివాలయంలో పంచాయతీరాజ్, రెవెన్యూ, భూగర్భ జల శాఖ అధికారులతో పనిచేయని బోర్ వెల్స్ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు మీనా, వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్లతో ఈ అంశంపై చర్చించారు. అనుమతి లేకుండా విచ్చలవిడిగా బోర్లు వేయడం, పనిచేయని వాటిని పూడ్చకపోవడంపై సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
నిబంధనలకు విరుద్దంగా బోర్లు వేసే రిగ్స్ ఓనర్లతో పాటు..భూ యజమానులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 350 రిగ్స్కు మాత్రమే భూగర్భ జల శాఖ అనుమతులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బోర్లు వేయడానికి 15 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలని, అనుమతి లేకుండా బోర్లు వేస్తే రిగ్ యజమానులపై లక్ష వరకు జరిమానా విధించాలని నిర్ణయించారు. అదే విధంగా అనుమతులు లేని రిగ్స్ను సీజ్ చేయడంతో పాటు.. జరిమానా విధించాలని నిర్ణయించారు.
భూ యజమాని, బోర్ ఉన్న సర్వే నెంబర్, బోర్ వేసిన రిగ్ ఓనర్, పనిచేయని బోర్ అయితే గుంతను పూడ్చారా, లేదా అన్న అంశాలపై గ్రామ కార్యదర్శి, విఆర్వోల ఆధ్వర్యంలో సమగ్ర సర్వేను చేపట్టాలని నిర్ణయించారు. సర్వే సందర్భంగానే ఎక్కడికక్కడ భూ యజమానులతో బోర్వెల్ గుంతలను పూడ్పించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.