మార్చి 15 తర్వాత తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర 2021 -22 బడ్జెట్, ఆశాజనకంగా వుండబోతున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సూచన ప్రాయంగా తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాల కోసం సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర 2021 -22 బడ్జెట్, ఆశాజనకంగా వుండబోతున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సూచన ప్రాయంగా తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాల కోసం సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆర్ధిక పద్దులో పొందు పరచాల్సిన శాఖల వారి బడ్జెట్ అంచనాలను, అధికారులు అందించిన ఆర్ధిక నివేదికలను పరిగణలోకి తీసుకుని పరిశీలించారు.
పలు సంక్షేమ, అభివృద్ది పథకాల అమలుతో పాటు, ఇప్పటికే అమలులో వున్న గొర్రెల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని సిఎం తెలిపారు.
ఈ పథకం ద్వారా యాదవులు గొల్ల కుర్మల కుటుంబాలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నందున ఇప్పటికే పంపిణీ చేసిన మూడు లక్షల ఢబ్బయి వేల యూనిట్లకు కొనసాగింపుగా మరో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణికిరానున్న బడ్జెట్ లో ప్రతిపాదనలను పొందుపరచనున్నామని సిఎం తెలిపారు.
గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నదని, దేశంలోనే అత్యంత అధికంగా షీప్ పాపులేషన్ వున్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నదని కేంద్రం గుర్తించిన నేపధ్యంలో, గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సిఎం తెలిపారు. అదే విధంగా ఇప్పటికే కొనసాగుతున్న చేపల పెంపకం కార్యక్రమం గొప్పగా సాగుతున్నదనీ, మంచి ఫలితాలు కూడా వస్తున్నందున దాన్ని కూడా కొనసాగిస్తామని సిఎం అన్నారు.
కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఖజానా కు దాదాపు యాభై వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని దాని ప్రభావం లక్ష కోట్లకు చేరుకున్నదని సిఎం తెలిపారు. కాగా.. కరోనాంతర పరిస్థితిలో రాష్ట్ర ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, వివిధ రూపాల్లో రాబడి పెరిగిందన్నారు.ఈ నేపథ్యంలో, గత బడ్జెట్ కంటే రాబోయే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగానే వుండే ఆస్కారమున్నదని సిఎం తెలిపారు.
నేటి ఉన్నత స్థాయి సమావేశంలో బడ్జెట్ అంచనాలు కేటాయింపులు కోసం విధి విధానాలు ఖరారయ్యాయని, రేపటినుంచి ఆర్ అండ్ బీ , పంచాయితీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ,విద్యా, ఇరిగేషన్ తదితరర శాఖలను వరుసగా పిలిచి, ఫైనాన్స్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు సమావేశాలు నిర్వహిస్తారని సిఎం తెలిపారు.
అన్ని శాఖలతో బడ్జెట్ పై కసరత్తు ముగిసిన తరువాత తుది దశలో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన బడ్జెట్ కు తుది మెరుగులు దిద్దడం జరుగుతుంది.
బడ్జెట్ మార్చి నెల మధ్యలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సిఎం తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు , ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, సిఎం ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ రావు,ఆర్ధిక సలహాదారు జిఆర్ రెడ్డి, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్టారావు, కార్యదర్శి రోనాల్డ్ రాస్, సిఎంవో అధికారులు భూపాల్ రెడ్డి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.