తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ కమిటీని నియమించింది.  ఆరు మాసాల్లో నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. 

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపుకోసం పే రివిజన్ కమిటీ (పీఆర్‌సీ) ని ఏర్పాటు చేసింది. పీఆర్‌సీ కమిటీ చైర్మన్ గా ఎన్. శివశంకర్ (రిటైర్డ్ ఐఎఎస్) ను , సభ్యునిగా బి. రామయ్య (రిటైర్డ్ ఐఎఎస్) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారంనాడు ఉత్తర్వులు జారీ చేశారు.

 6 నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అంద చేయాలని కమిటీకి ఉత్తర్వుల్లో ప్రభుత్వం సూచించింది. పీఆర్సీ కి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, స్టాఫ్ ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది.ఐదు శాతం మధ్యంతర భృతి (ఐ ఆర్ ) ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.కొత్త పీఆర్‌సీని ఏర్పాటు చేస్తామని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. శాసనసభ సమావేశాల్లో కూడ ఈ విషయాన్ని కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనకు అనుగుణంగా ఇవాళ పీఆర్‌సీ కమిటీని ఏర్పాటు చేశారు. కొత్త పీఆర్‌సీ అమలు చేసే వరకు ఐదు శాతం మధ్యంతరభృతిని కూడ ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇది రెండో పీఆర్‌సీ. 

2018లో తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా పీఆర్‌సీని ఏర్పాటు చేసింది.సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలో కమిటీ చైర్మెన్ గా నియమించింది. రిటైర్డ్ ఐఎఎస్ లు సి.ఉమామహేశ్వరరావు, మహ్మద్ అలీ రఫత్ లను సభ్యులుగా నియమించింది.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నియమించిన పదో పీఆర్‌సీ 2018 వరకు అమల్లో ఉంది.2018 జూలై 1వ తేదీ నుండి ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సి ఉంది. దీంతో 2018లో ప్రభుత్వం పీఆర్‌సీ కమిటీని నియమించింది.