మందుబాబులకు హైదరాబాద్ పోలీసుల ‘‘గంట’’ బోనస్
హైదరాబాద్లోని మందుబాబులకు శుభవార్త.. ఇకపై జీహెచ్ఎంసీ పరిధిలోని బార్లలో వీకెండ్లో రాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
హైదరాబాద్లోని మందుబాబులకు శుభవార్త.. ఇకపై జీహెచ్ఎంసీ పరిధిలోని బార్లలో వీకెండ్లో రాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలకు అనుమతి ఉంది. అయితే శుక్ర, శని వారాల్లో మద్యం అమ్మకాలకు డిమాండ్ ఉండటంతో.. గంటపాటు అదనంగా సమయం కావాలని బార్లు, పబ్ల యజమాన్యాలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
దానికి తోడు దేశంలోని మెట్రో నగరాలలో అమ్మకాలకు.. హైదరాబాద్లోని లిక్కర్ సేల్స్కు మధ్య వ్యత్యాసం ఉండటంతో శుక్ర, శని వారాల్లో అదనంగా మరో గంట మద్యం అమ్మకాలకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 400 వరకు బార్లు, పబ్లు ఉన్నాయని అంచనా.. ప్రతి రోజు లక్ష లీటర్ల మద్యం, ఐదు లక్షల లీటర్ల బీర్లు అమ్మకం జరుగుతున్నాయి. తాజా ఆదేశాల వల్ల మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.