సికింద్రాబాద్ రూబీ హోటల్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై తెలంగాణ ఫైర్ డిపార్ట్‌మెంట్ నివేదిక సమర్పించింది. అగ్నిప్రమాదం సెల్లార్‌లోనే జరిగిందని.. తర్వాత మంటలు మొదటి అంతస్తు వరకు వ్యాపించాయని అధికారులు తెలిపారు. 

సికింద్రాబాద్ రూబీ హోటల్ దుర్ఘటనపై ఫైర్ డిపార్ట్‌మెంట్ సమర్పించిన నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 3 పేజీల నివేదికలో కీలక విషయాలను ప్రస్తావించారు అధికారులు. లిథియం బ్యాటరీ పేలుళ్ల వల్ల దట్టమైన పొగలు వ్యాపించాయని తెలిపారు. దట్టమైన పొగల వల్ల ఫైర్ సిబ్బంది భవనం లోపలికి వెళ్లలేకపోయారని.. భవనానికి ఒక్కటే ఎంట్రీ, ఎగ్జిట్ మాత్రమేనని అగ్నిమాపక శాఖ తెలిపింది. లిఫ్ట్ పక్కన మెట్లు ఏర్పాటు చేయకూడదన్న నిబంధన పట్టించుకోలేదన్నారు. 

అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయడం లేదని తెలిపింది. భవనం మొత్తం కూడా క్లోజ్డ్ సర్క్యూట్‌లో వుండిపోయిందని.. భవనానికి కనీసం కారిడార్ కూడా లేదని అగ్నిమాపక శాఖ పేర్కొంది. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయలేదని.. భవన , హోటల్ యజమాని నిర్లక్ష్యంతోనే అగ్నిప్రమాదం సంభవించిందని ఫైర్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. అగ్నిప్రమాదం సెల్లార్‌లోనే జరిగిందని.. తర్వాత మంటలు మొదటి అంతస్తు వరకు వ్యాపించాయని అధికారులు తెలిపారు. 

ALso REad:సికింద్రాబాద్ రూబీ లాడ్జీ అగ్ని ప్రమాదం: బైక్ షోరూమ్ యజమానిపై కేసు

ఇకపోతే.. సికింద్రాబాద్ రూబీ హోటల్‌‌లో అగ్నిప్రమాదం కారణంగా మరణించిన వారిని పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఏడుగురిని గుర్తించినట్లుగా తెలుస్తోంది. మరొకరిని గుర్తించే ప్రయత్నాల్లో వున్నారు. మరణించిన వారిని అల్లాడి హరీశ్, బాలాజీ, వీరేంద్ర కుమార్, సీతారామన్, రాజీవ్ మాలిక్, సందీప్ మాలిక్, మిథాలి మహాపాత్రలుగా గుర్తించారు. గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు పది మంది. వీరిలో ఒకరి పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. 

కాగా.. సోమవారం రాత్రి  9.40 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.  విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇవి వచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు. వేడికి షో రూమ్ లోని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలాయి. దీనివల్ల  మంటల ఉధృతి మరింత పెరిగింది. వాహనాలకు వ్యాపించడంతో పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. మెట్ల మార్గం ద్వారా పైఅంతస్తులకు వ్యాపించాయి. దీనికి తోడు వాహనాలు,  బ్యాటరీల కారణంగా దట్టమైన పొగ అలుముకుంది. 

ఆ సమయంలో లాడ్జిలో 25 మంది …
లాడ్జిలో మొత్తం ఇరవై మూడు గదులు ఉన్నాయి. వీటిలో దాదాపు 25 మంది పర్యాటకులు ఉన్నట్లు అంచనా. ప్రమాదంతో ఒక్కసారిగా హోటల్లోని పర్యాటకులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో హాహాకారాలు చేయసాగారు.  విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో చీకట్లో ఏమైందో అని భయాందోళనకు గురయ్యారు. వాహనాల నుంచి వెలువడిన పొగ కారణంగా ఊపిరి ఆడక  కొందరు స్పృహ తప్పి లాడ్జి గదులలో,  కారిడార్లో పడిపోయారు. దట్టంగా పొగ చూడడంతో శ్వాస తీసుకునే పరిస్థితి లేక ఏడుగురు పర్యాటకులు చనిపోయారు.