కారణమిదీ:కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు హరీష్ రావు లేఖ
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని ఆ లేఖలో ఆయన కోరారు.
హైదరాబాద్: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రికి తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Harish Rao సోమవారం నాడు లేఖ రాశారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలంటూ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆ Letter లో కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitaramanను కోరారు.
A.P. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేండ్ల బకాయి రూ.900 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉందని మంత్రి గుర్తు చేశారు. ఈ నిధులను విడుదల చేయడంతోపాటు గ్రాంట్ను 2021-22 తర్వాత ఐదేళ్లపాటు పొడిగించాలని కోరారు. Niti Ayog సూచించిన మేరకు రూ.24,205 కోట్లు విడుదల చేయాల్సిందిగా కోరారు.
స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు (గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 502.29 కోట్లు) ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం ఎందుకు తిరస్కరించిందో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు.. రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ, నిర్దిష్ట కారణం లేకుండా ఈ గ్రాంట్లను తిరస్కరించారని ఆ లేఖలో మంత్రి గుర్తు చేశారు. వీలైనంత త్వరగా విడుదలయ్యేలా చూడాలని హరీష్ రావు కోరారు.
2019-20తో పోల్చితే 2020-21లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతుందని ఈ మేరకు తెలంగాణకు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం సూచించిందని హరీష్ రావు ఆ లేఖలో పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను గతంలో ఎప్పుడూ తిరస్కరించిన సందర్భాలు లేవన్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ నిధులను మంజూరు చేయాలని నిర్మలా సీతారామన్ ను కోరారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాలలో రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమైన 2014-15లో కేంద్రం వాటాను పొరబాటున Telangana కు కాకుండా Andhra Pradesh కు విడుదల చేశారన్నారు. దీంతో తెలంగాణకు రావాల్సిన రూ.495.20 కోట్లు ఆంధ్రప్రదేశ్కు వెళ్లాయన్నారు. ఈ విషయాన్ని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అయితే ఈ నిధులు ఇంకా తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదని మంత్రి గుర్తు చేశారు. ఈ మొత్తాన్ని వెంటనే తెలంగాణకు విడుదల చేయాలని మంత్రి కేంద్రాన్ని కోరారు.వీటితోపాటు పెండింగ్ లో ఉన్న జీఎస్టీ నిధులు రూ.210 కోట్లను కూడా సర్దుబాటు చేయాలన్నారు.