కన్న తల్లిదండ్రులకు తిండి, నీరు పెట్టని కొడుకు.. వారు చనిపోవడంతో..
కనీసం తల్లిదండ్రులకు తిండి, నీరు కూడా ఇవ్వకుండా వారిని మాడ్చేశాడు. ఆకలి, దప్పికలు తీరక.. వారు ప్రాణాలు కోల్పోయారు.
తమను కని, పెంచి.. మంచి భవిష్యత్తు ఇచ్చిన తల్లిదండ్రులను వృద్దాప్య దశలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిందిపోయి.. దారుణంగా ప్రవర్తించాడు. భార్యతో కలిసి.. కనీసం తల్లిదండ్రులకు తిండి, నీరు కూడా ఇవ్వకుండా వారిని మాడ్చేశాడు. ఆకలి, దప్పికలు తీరక.. వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన సూర్యాపేటలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం మోతే మండలంలోని తుమ్మగూడెం గ్రామంలో మే 27న నల్లు రామచంద్రా రెడ్డి(90), అతని భార్య అనసూర్యమ్మ (80)లు ఒకేసారి మృతి చెందారన్నారు. వారి మృతదేహాలను కుటుంబీకులు పూడ్చి పెట్టారన్నారు. అయితే వారి చావుపై పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారన్నారు.
దీంతో పోలీసులు విచారణ చేపట్టారన్నారు. పూడ్చిన మృతదేహాలను బయటకు తీసి పోలీసులు రీ పోస్టుమార్టం నిర్వహించారని ఆయన తెలిపారు. తల్లిదండ్రుల చావుకు కారణం కొడుకు నాగేశ్వర్ రెడ్డి, కోడలు లక్ష్మిలని నిర్దారణ కావడంతో వారి ఇరువురిని అరెస్ట్ చేసినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.