ఒప్పందం మేరకు ధాన్యం అందించడంలో తెలంగాణ విఫలం- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ఎఫ్సీఐతో ఒప్పందం చేసుకున్న ప్రకారం ధాన్యం సేకరించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. బుధవారం కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్ సభలో సమాధానం ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐకి చేసుకున్న ఒప్పందం ప్రకారం ధాన్యం అందించడంలో విఫలమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. లోకసభలో బుధవారం ఆహార భద్రత పథకాలకు సంబంధిచిన ప్రశ్నలు అడుగుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అదనపు ప్రశ్న అడిగారు. తెలంగాణలో ఎస్సీఐ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పటి వరకు సగం కూడా సేకరించలేదని, దీనికి గల కారణాలేంటని ఆయన ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. నిజానికి ప్రస్తుతం జరుగుతున్న చర్చలో ఈ ప్రశ్నకు సంబంధం లేదని అయినా తప్పుడు ప్రచారం జరగకూడదు అనే ఉద్దేశంతో తాను సమాధానం ఇస్తున్నాని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒప్పందం చేసుకుందని అన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకుంటామని ఒప్పందంలో ఉందని అన్నారు. ఆ మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం అని తెలిపారు. కానీ ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని విమర్శించారు. తాము నిర్దేశించిన లక్ష్యంలో ఇప్పటి వరకు తెలంగాణ సగం కూడా రీచ్ కాలేకపోయిందని అన్నారు. ఎస్సీఐ డైరెక్ట్ గా ధాన్యాన్ని సేకరించలేదని తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన ధాన్యాన్ని ఎఫ్సీఐకి అప్పజెప్తారని అన్నారు. తాము నిర్దేశించిన లక్ష్యం బియ్యం సేకరణకు గడువు ముగిసిందని అయినా ఇప్పుటికే రెండు, మూడు సార్లు గడువు పెంచామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో అలసత్వం వహిస్తోందని అన్నారు.
యాసంగిలో ఏ పంట వేయాలో తెలియక వరి రైతుల అయోమయం..
రెండు ప్రభుత్వాలకు ముందుచూపు లేదు- ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి..
ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పంజాబ్తో ఒక కోటికి పైగా మెట్రిక్ టన్నులు ఒప్పందం చేసుకుందని చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నులే సేకరిస్తామని చెప్పిందని అన్నారు. అయినా ఇప్పటి వరకు కేవలం పది లక్షల మెట్రిక్ టన్నులే సేకరించిందని అన్నారు. దీనికి కారణం ధాన్యం సేకరించడానికి సంచులు లేకపోవడమే అని అన్నారు. తెలంగాణలో నిర్దేశించిన ధాన్యం సేకరించాలంటే 15 కోట్లకుపైగా సంచులు అవసరమౌతాయని తెలిపారు. కానీ ముందు చూపు లేకపోవడంతో బస్తాలు ఏర్పాటు చేసుకోలేకపోయారని ఆరోపించారు. ప్రభుత్వం రెండు లక్షల బడ్జెట్ ప్రవేశపెడుతోందని తెలిపారు. అందులో రైతుల నుంచి ధాన్యం సేకరణకు పది వేల కోట్లు ఖర్చు చేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు.