యాసంగిలో ఏ పంట వేయాలో తెలియక వరి రైతుల అయోమయం..
వడ్ల కొనుగోలు విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో వరి రైతులు పరేషాన్ అవుతున్నారు. యాసంగిలో ఏ పంట వేయాలో తెలియక అయోమయంలో పడుతున్నారు.
వరి.. ఈ పంట చుట్టే కొన్ని నెలలుగా తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. ఈ పంట కొనుగోలు విషయంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. వడ్లను కొనుగోలు చేయాలని టీఆర్ఎస్, బీజేపీలు ఇటీవల ధర్నాలు నిర్వహించాయి. రాష్ట్రం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కొనబోనంటోందని టీఆర్ఎస్ ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నాయి. వానాకాలం ధాన్యం కొనుగోలు విషయంలో ప్రస్తుతం పార్లమెంట్లో చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో వరి రైతు ఆగమవుతున్నాడు.
వరి వేయాలా ? వద్దా ?
మెరుగైన ధాన్యం వచ్చే వానకాలం పంట కొనుగోళ్ల సమయంలోనే ఇంత గందరగోళం నెలకొంది. మరి నూకలు అధికంగా వచ్చే యాసంగి పంట కొనుగోలు చేసే సమయంలో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే వరి రైతులు ఆందోళన చెందుతున్నారు.
అందుకే యాసంగిలో వరి సాగు చేయాలా వద్దా అనే విషయంలో ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం మా్తరం వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని కోరుతోంది. ఇప్పుడు వచ్చే ధాన్యంతో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని, దానిని ఎఫ్సీఐ కొనబోనని చెబుతున్నందున్న రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపాలని సూచిస్తోంది.
పంటల మార్పుల వల్ల భూసారం పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుపుతోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయడం వల్ల రైతులు అధిక ఆదాయం పొందవచ్చని చెబుతోంది. వరికి బదులుగా ఇతర ఆరుతడి పంటలు పండిచాలని రైతులను కోరుతోంది. అందులో భాగంగా పంట మార్పిడి చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందించాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
ఆరుతడి పంటలపై రైతుల అయిష్టత..
తెలంగాణ ప్రభుత్వం ఎంత చెబుతున్నా.. రైతులు మాత్రం ఆరుతడి పంటల వైపు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఆయకట్టు భూములకు నీరు పుష్కలంగా అందుబాటులో ఉంటుంది. తేమ అధికంగా ఉండే అలాంటి భూముల్లో వేరే పంటలు వేసినా.. అంతగా దిగుబడి రాదు. మిగితా ఆరుతడి పంటలతో పోలిస్తే వరి సాగు చేయడం కొంత సులభమని రైతులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏ పంట వేసినా గిట్టుబాటు కాదని, వరి అయితేనే కొంత నయమనే అభిప్రాయాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
అయితే తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఒక విషయాన్ని స్పష్టం చేసింది. వానాకాలంలో పండిన ధాన్యం మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, యాసంగి పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వం కలుగజేసుకోదని చెబుతోంది. కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోబోమని స్పష్టం చేస్తున్నందున్న..ఇక నుంచి యాసంగిలో ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు ఉండవని ఇటీవల సీఎం కేసీఆర్ చెప్పారు. మళ్లీ వడ్లు పండించి పరేషాన్ కావొద్దని సూచించారు. గతేడాది జొన్నల కొనుగోలు విషయంలో ప్రభుత్వం చాలా నష్టపోయిందని, ఈ సారి వరి విషయంలో అలా జరగకూడదని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఏ పంట వేయాలో అర్థంకాక అయోమయానికి గురవుతున్నాడు.