తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి కీలకంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీకి దిగారు. కానీ అక్కడ గెలిచింది మాత్రం ఓ సామాన్యుడు.. ఆయనే స్థానికులైన కాటిపల్లి వెంకట రమణారెడ్డి. ఆయన బీజేపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రినే ఓడించాడు. 

కామారెడ్డి : మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షతో ఉన్న కెసిఆర్ గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేశారు. కానీ కామారెడ్డిలో స్థానికుడైన బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. కెసిఆర్ తో పాటు ఆయన టీపీసీసీ చైర్మన్, ప్రస్తుత ముఖ్యమంత్రి అభ్యర్తి రేవంత్ రెడ్డిని కూడా ఓడించి రికార్డు బద్దలు కొట్టారు. ఓ రౌండ్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కనిపించారు. కానీ.. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ స్థానికుల అభిమాన నాయకుడైన కాటిపల్లి వెంకట రమణారెడ్డి గెలిచారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గతవారం దాకా ఇక్కడ వెంకట రమణా రెడ్డి బలమైన అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఎన్నికలు జరిగి కౌంటింగ్ కు వచ్చేదాకా కాస్త అపనమ్మకం కనిపించింది. దీనికి కారణం కాంగ్రెస్ వేవ్. కానీ కాటిపల్లి వెంకట రమణారెడ్డి నిలిచి, గెలిచారు. వేరే ప్రాంతాలనుంచి వచ్చి పోటీచేసిన వారిని కాదని, తమలో ఒకడిగా నిశ్శబ్దంగా తన మానన తాను పనిచేసుకుంటున్న వెంకట రమణారెడ్డిని గెలిపించారు కామారెడ్డి ప్రజలు. 
- వెంకట రమణారెడ్డి గెలవడానికి గల కారణాలేంటంటే... 
- అతడు కట్టర్ హిందుత్వ వాది కాకపోవవడం, 
- బిజెపిలో ఉన్నా ఆయన మొదట కాంగ్రెస్ పార్టీ వ్యక్తే కావడం 
మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ గా అభివృద్ధికి చేపట్టిన చర్యలు 

Telangana Election Results 2023 : తెలంగాణ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే.. పూర్తి జాబితా...

వీటన్నిటికన్నా మరో ముఖ్యాంశం, నూటా యాభై కోట్లతో స్వతంత్ర మ్యానిఫెస్టో ఒకటి ప్రకటించి, ఇంటింటికీ వెళ్ళడం, గెలిచినా ఓడినా ఆ నిధులతో పనులు నేరేవేరుస్తానని, ముఖ్యంగా అందులో ఉచిత విద్య, ఆరోగ్యం కీలకంగా పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తూ వెళ్లడం కలిసి వచ్చింది. 

తనది రాజకీయం కాదని విశ్వసనీయ ప్రజా ప్రతినిధిగా ఆయన ప్రజల్లోకి వెళ్లారు. నియోజకవర్గం పొడవునా దళిత బహుజనులకోసం, ఎవరు తనను కలిసినా గుడుల నిర్మాణానికి ఆయన ఆర్ధిక సహాయం చేసిన పేరు ఉన్నది. ఇదే కాదు, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో నిర్వాసితులవుతున్న, దెబ్బ తింటున్న ఇరవై వేల రైతులకు ఆయన ఆప్తుడయ్యారు. నిజానికి ఆయన ఆధ్య్వర్యంలోనే ఈ పోరాటం ఊపందుకున్నది. వారితో కలిసి ఆయన పోరాటం చేపట్టారు. ఇవన్నీ ఆయన్ని తమ ప్రియతమ నాయకుడిగా చేశాయి. 

ఆయన పేరుకు బిజెపి అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఒక స్వతంత్ర అభ్యర్థిగా ప్రజాదరణ విశేషంగా పెంచుకున్నారు. వాస్తవానికి ఇక్కడ కెసిఆర్ రావడం, అతడి వల్ల రేవంత్ రెడ్డీ వచ్చి చేరడం, వీరిద్దరూ స్థానికులు కాకపోవడం, వారి రాకతో వెంకటరమణారెడ్డి మొదట కాస్త డీలా పడ్డారు. కానీ తరువాత పుంజుకున్నారు. రాజకీయల కన్నా నియోజక వర్గ ప్రగతి ముఖ్యమని ప్రజలు గ్రహించడంతో చివరికి కాటిపల్లి వెంకట రమణారెడ్డినే విజయం వరించింది.