తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు క్షుద్రపూజలు చేశారంటూ వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. తాను గిరిజన పూజలో పాల్గొన్నానని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
తాను ఎలాంటి క్షుద్రపూజల్లో (black magic) పాల్గొనలేదని తెలంగాణహెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు (telangana health director srinivasa rao) క్లారిటీ ఇచ్చారు. సేవా కార్యక్రమాలను ఓర్వలేకనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి బురద జల్లే వ్యక్తుల మాటలను ప్రజలు విశ్వసించాల్సిన అవసరం లేదని డీహెచ్ పేర్కొన్నారు. బుధవారం కొన్ని ఛానెళ్లలో ప్రసారమైన వార్తలను ఈ సందర్భంగా డీహెచ్ శ్రీనివాసరావు ఖండించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు, మీడియా ప్రతినిధులు కూడా ఆలోచించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొంటే తప్పేందముందని శ్రీనివాసరావు ప్రశ్నించారు. స్థానికుల ఆహ్వానంతోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (bhadradri kothagudem) సుజాతనగర్ మండలంలో జరిగిన పూజ కార్యక్రమానికి వెళ్లినట్లు డీహెచ్ చెప్పారు.
స్వయం ప్రకటిత దేవతతో సంబంధం లేదని... మూఢ నమ్మకాలను అసలే విశ్వసించనని స్పష్టం చేశారు. తప్పుడు అర్థాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. తన తండ్రి స్పూర్తితో జీఎస్సాఆర్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు విస్తృతంగా సామాజిక సేవలు అందిస్తుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కరోనా నియంత్రణలో రెండున్నరేళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసిన తాను మానసిక ప్రశాంతత కోసం సెలవుల్లో సొంత గ్రామానికి వెళ్లి వస్తున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు. కానీ ఎక్కువ సార్లు వచ్చారంటూ చర్చించుకోవడంలో అర్థం లేదన్నారు.
కరోనాకు (coronavirus) ముందు కూడా ఎన్నోసార్లు కొత్తగూడెం ప్రాంతానికి వస్తూ ఉండేవాడినని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కాస్త బయట ఎక్కువగా తిరుగుతున్నానని శ్రీనివాసరావు వివరించారు. కానీ స్వార్ధపూరిత వ్యక్తులు జీర్ణించుకోలేక తనపై బురద జల్లుతున్నారని ఆయన విమర్శించారు. వాళ్లకు కనువిప్పు కలిగే రోజు వస్తుందని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్ గా ఉన్న తనకు రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదన్నారు.
మెగా హెల్త్ క్యాంపు ఏర్పాట్లలో భాగంలోనే గత కొంత కాలంలో కొత్తగూడెం ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధిపై ఫోకస్ పెట్టానని... ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్లు చేయించినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని.. పేదలకు మేలు జరగడం కోసం తాను చేసే సేవా కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం కావాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
