మరియమ్మ కస్టోడియల్ డెత్పై విచారణ: డీజీపీ మహేందర్ రెడ్డి
మరియమ్మ కస్టోడియల్ డెత్పై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డ తెలిపారు. ఆదివారం నాడు ఖమ్మంలో మరియమ్మ కొడుకును తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పరామర్శించారు.
హైదరాబాద్: మరియమ్మ కస్టోడియల్ డెత్పై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డ తెలిపారు. ఆదివారం నాడు ఖమ్మంలో మరియమ్మ కొడుకును తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో కస్టోడియల్ డెత్ కు గురైన మరియమ్మ కుటుంబసభ్యులను పరామర్శించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ డీజీపీని ఆదేశించారు. దీంతో డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కొడుకు ఉదయ్ కిరణ్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
also read:మరియమ్మ కస్టోడియల్ డెత్పై విచారణకు కేసీఆర్ ఆదేశం
మరోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రెండ్లి పోలీసింగ్ నిర్వహిస్తున్నారన్నారు. పోలీస్ అధికారులు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరియమ్మ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం తరపున సహాయం అందజేశామని ఆయన వివరించారు.
అంతకుముందు ఉదయ్ కిరణ్ తో డీజీపీ మాట్లాడారు. పోలీసులు విచక్షణ రహితంగా తనతో పాటు తన తల్లిని, స్నేహితుడిని కొట్టారన్నారు. తన చేతుల్లోనే తన తల్లి ప్రాణాలు కోల్పోయిందని ఆయన చెప్పారు. మరియమ్మపై ఎంతమంది పోలీసులు కొట్టారనే విషయమై డీజీపీ ప్రశ్నించారు.