Asianet News TeluguAsianet News Telugu

మంద కృష్ణకు డిప్యూటీ సిఎం కడియం స్ట్రాంగ్ వార్నింగ్

  • విద్యార్థులకు నష్టం జరిగితే మంద దే బాధ్యత
  • విద్యార్థుల భవిష్యత్ కోసం ఎమ్మార్పీఎస్ బంద్ వాయిదా వేసుకోవాలి
  • విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు
  • రాజకీయాలకు, విద్యకు ముడిపెట్టి బంద్ లు చేయోద్దు
  • బంద్ ఉన్నా.. పరీక్షలు జరిపి తీరుతాం
  • అవసరమైతే ఒక నిమిషం నిబంధన సడలింపు
telangana deputy cm kadiyam srihari strong warning to manda krishna madiga

ఇంటర్ విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో ఈనెల 13న జరపతలపెట్టిన తెలంగాణ బంద్ ను వాయిదా వేసుకోవాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగను కోరారు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. బంద్ వాయిదా వేసుకోకుండా జరిపితే రేపు విద్యార్థులకు ఏమైనా నష్టం జరిగితే ఆ బాధ్యత మంద కృష్ణదే అని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ బంద్ కు సహకరించే  రాజకీయ పార్టీలు కూడా ఆలోచించి బంద్ వాయిదాకు సహకరించాలన్నారు. ఈ నెల 13వ తేదీన ఇంటర్ మొదటి సంవత్సరం కెమెస్ట్రీ పరీక్ష తప్పకుండా జరుగి తీరుతుందని విద్యార్థులు మంచిగా ప్రిపేర్ కావాలని, పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.

ఈ నెల 13న తెలంగాణలో ఎమ్మార్పీఎస్ తలపెట్టిన బంద్ ను వాయిదా వేసుకోవాలని కోరుతూ...ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మినిష్టర్ క్వార్టర్స్ లో ఆయన నివాసంలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీల వర్గీకరణ కోసం విద్యార్థులను ఇబ్బంది పెడితే...నష్టపోయేది తెలంగాణ విద్యార్థులేనని ఆయన అన్నారు. రాజకీయాలను పరీక్షలకు ముడిపెట్టవద్దని, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేయవద్దని కోరారు. 13వ తేదీన ఇంటర్ మొదటి సంవత్సరం కెమెస్ట్రీ పరీక్ష ఉందని, దీనికి లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. ఈ పరీక్షను బంద్ నేపథ్యంలో వాయిదావేద్దామని ఆలోచించామని, అయితే 14వ తేదీన ఉగాది ఉందని, తర్వాత శ్రీరామ నవమి ఉందన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ లో పరీక్ష నిర్వహించాలనుకుంటే.. ఏప్రిల్ 15వతేదీలోపు ఇంటర్ పరీక్షల ఫలితాలు ప్రకటించాల్సి ఉందన్నారు. లేనిపక్షంలో విద్యార్థులు జాతీయ పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పరీక్షల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఒత్తిడికి లోనవుతుంటారని,  ఈ సమయంలో బంద్ కు పిలుపునివ్వడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.

 ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. వర్గీకరణ కోసం ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మాణం చేసిన కాపిని మే 10, 2016న ముఖ్యమంత్రి కేసిఆర్, తాను స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడికి ఇచ్చామన్నారు. అనేకసార్లు లేఖలు రాశామన్నారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్లేందుకు మూడుసార్లు ప్రధాని అపాయింట్ మెంట్ అడిగామని తెలిపారు. కానీ ప్రధానమంత్రి నుంచి సరైన స్పందన రాలేదన్నారు. అందుకే ఈ పార్లమెంట్ సమావేశాల్లోపే ఎస్సీ వర్గీకరణ, ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేయాలనుకుంటున్నామన్నారు. కనీసం ఎస్సీ వర్గీకరణను తెలంగాణకు పరిమితం చేసైనా అంగీకరించాలని అడుగుతున్నామన్నారు. అయితే దురదృష్టవశాత్తు కేంద్రం నుంచి సరైన స్పందన రావడం లేదన్నారు. కేంద్రానికి వర్గీకరణ చేసే ఉద్దేశ్యం లేనట్లు ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణకు కట్టుబడి ఉన్న నేపథ్యంలో బంద్  కు పిలుపునిచ్చిన మందకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్, సహకరించే రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని బంద్ వాయిదా వేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మరోసారి కోరారు. విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో బంద్ వాయిదా కోసం కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బిజెపి లక్ష్మణ్ , ఇతర నేతలతో కూడా తాను మాట్లాడినట్లు చెప్పారు. పార్టీలో చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని ఆయా పార్టీల నేతలు చెప్పారన్నారు.

ఈ నెల 13న పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, పోలీసులు, ఆర్టీసీ అధికారులతో మాట్లాడినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విద్యార్థులు ఎలాంటి అనుమానాలు, అపోహలకు లోను కాకుండా, బంద్ వార్తలను పట్టించుకోకుండా పరీక్షలకు ప్రిపేర్ కావాలని సూచించారు. విద్యార్థులు ఎవరైనా పరీక్షలకు హాజరు కాకుండా నష్టపోతే దానికి ఎమ్మార్పీఎస్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని బంద్ వాయిదావేసి అందరూ సహకరించాలని కోరారు.

బంద్ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలకు విధించిన ఒక నిమిషం నిబంధనను సడలించి పరీక్ష రాసే వెసులుబాటు కల్పిస్తామని, తప్పకుండా పరీక్ష నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఆందోళనకు గురి కాకుండా పరీక్షలు రాయాలన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios