పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: కృష్ణా బోర్డు చైర్మెన్ను కలిసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం నాడు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఛైర్మెన్ కు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం నాడు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఛైర్మెన్ కు ఫిర్యాదు చేశారు.
పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఈ నెల 5వ తేదీన 203 జీవో జారీ చేసింది.ఈ జీవో ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చును పెడుతోంది. తెలంగాణకు చెందిన అన్ని పార్టీలు ఈ జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఫిర్యాదుతో ఈ నెల 13న కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశం కూడ జరిగింది.
also read:పోతిరెడ్డిపాడుపై వివాదాస్పద జీవోలు: నాడు వైఎస్ఆర్, నేడు జగన్
ఇవాళ మధ్యాహ్నం కృష్ణా రివర్ బోర్డు ఛైర్మెన్ ను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కలిసింది. 203 జీవోపై ఫిర్యాదు చేసింది. తెలంగాణకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కోరారు.ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవోపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు.
ఏపీ తీరుతో తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ బృందం కృష్ణా బోర్డు ఛైర్మెన్ దృష్టికి తీసుకెళ్లారు.44 వేల క్యూసెక్కుల కంటే ఎక్కువ నీటిని ఏపీ ప్రభుత్వం వాడుకొంటుందని కాంగ్రెస్ నేతలు ఈ సందర్బంగా చెప్పారు.
ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంపు విషయమై జనవరిలోనే తెలిసినా కేసీఆర్ ఎందుకు స్పందించలేదో చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తాము లేవనెత్తిన అంశాలపై బోర్డు చైర్మెన్ సానుకూలంగా స్పందించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించారు.