రేవంత్  నీవెలా ఓడావు... ఖచ్చితంగా గెలవాల్సిన సీటు  కదా... అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి ఎందుకు దూరం కావాల్సి వచ్చిందని  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నించారు.

హైదరాబాద్: రేవంత్ నీవెలా ఓడావు... ఖచ్చితంగా గెలవాల్సిన సీటు కదా... అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి ఎందుకు దూరం కావాల్సి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నించారు.

తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ మంగళవారం నాడు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఆయన పార్టీ నేతలతో చర్చించారు.ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, ఆత్రం సక్కు మినహా మిగిలిన ఎమ్మెల్యేంతా హాజరయ్యారు.

కొడంగల్‌లో రేవంత్ ఎలా ఓడిపోయావని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఖచ్చితంగా గెలవాల్సిన సీటు కదా అంటూ రాహుల్ రేవంత్ ను ప్రశ్నించారు. అయితే తన నియోజకవర్గంలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని రేవంత్ రాహుల్‌కు వివరించారు. డబ్బు పంపిణీ, తనను నిర్భంధించడం తదితర కారణాల వల్ల ఓడిపోవాల్సి వచ్చిందని రేవంత్ రాహుల్‌కు వివరించినట్టు సమాచారం. 

అంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఓటమికి గల కారణాలపై రాహుల్ గాంధీ ఒక్కొక్కరిని ప్రశ్నించారు. టిక్కెట్ల కేటాయింపులో జాప్యంతో పాటు,సీట్ల సర్ధుబాటులో ఆలస్యం కూడ పార్టీ ఓటమికి కారణమని కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్‌కు వివరించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అనే అంశం కూడ ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందని చెబుతున్నారు.

పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రాహుల్ గాంధీకి వివరించారు. టీఆర్ఎస్‌ ఎన్నికలను చంద్రబాబును బూచిగా చూపి సెంటిమెంట్‌ను రగిల్చిందని కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి రాహుల్‌కు వివరించారు. కేసీఆర్‌తో పోటీ పడే నేతలు కాంగ్రెస్ పార్టీలో లేడని ఆ పార్టీ నేతలు రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు. 

ప్రభుత్వ వ్యతిరేకతపై బలమైన ప్రజా ఉద్యమం జరగలేదని కొందరు కాంగ్రెస్ నేతలు రాహుల్‌కు వివరించారు. రాష్ట్రంలో ఓటమిపై పార్టీ నేతలు ఇచ్చిన వివరణపై రాహుల్ గాంధీ సంతృప్తి చెందలేదని సమాచారం.