రేవంత్ రెడ్డిని కౌగిలించుకున్న కాంగ్రెస్ సభ్యులు
- అసెంబ్లీ ఎల్పీ ఆఫీసుల వద్ద కలుసుకున్న రేవంత్, కాంగ్రెస్ నేతలు
- కౌగిలించుకుని స్వాగతం పలికిన షబ్బీర్ అలీ
- ఎమ్మెల్యే సంపత్ కూడా
- ముభావంగా కనిపించిన పొంగులేటి సుధాకర్ రెడ్డి
అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అసెంబ్లీకి గురువారం ఉదయం వెళ్లారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలోని సిఎల్పీ కార్యాలయం ముందు ఉన్నారు. దీంతో రేవంత్ అప్పుడే అక్కడికి రావడంతో కాంగ్రెస్ నేతలు వరుసపెట్టి కౌగిలించుకున్నారు.
మండలి ఉపనేత షబ్బీర్ అలీ ముందుగా రేవంత్ ను అలింగనం చేసుకున్నారు. వెల్ కమ్ రేవంత్ భాయ్ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసిండు షబ్బీర్ అలీ. షబ్బీర్ వెంట ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన కూడా రేవంత్ తో ముక్తసరిగా మాట్లాడారు. పైగా ముఖం తిప్పుకున్నారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సంపత్ కూడా రేవంత్ ను కౌగిలించుకుని సాదర స్వాగతం పలికారు.
అయితే వారిని పలుకరించిన తర్వాత రేవంత్ రెడ్డి టిడిఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డికి టిడిఎల్పీ నేతగా ఉండరాదని చంద్రబాబు సందేశాన్ని ఎల్. రమణ ఉదయమే రేవంత్ కు అందజేశారు. దీంతో రేవంత్ రెడ్డి టిడిఎల్పీ ఆఫీసులోకి వెళ్లిన తర్వాత టిడిఎల్పీ నేత కుర్చీలో కూర్చోకుండా పక్కన కూర్చున్నారు. అయితే ఆ కుర్చీలో ఎందుకు కూర్చోలేదని కొందరు అడిగినా రేవంత్ సమాధానమివ్వలేదు. టిడిఎల్పీ నేత కుర్చీలో కూర్చోకపోవడం చూస్తే రేవంత్ పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకే నడుచుకున్నట్లు చెబుతున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
లక్ష్మిపార్వతి షాకింగ్ నిర్ణయం (వీడియో) చూడండి