తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పు ఖాయం... నేతలకు దిగ్విజయ్ సంకేతాలు ..
తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో దానిని పరిష్కరించే బాధ్యతను హైకమాండ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్కు అప్పగించింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి సీనియర్లతో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
టీ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సమావేశాలు కొనసాగాయి. దాదాపు 8 గంటలుగా ఈ భేటీలు జరిగాయి. దిగ్విజయ్తో మాజీ ఎంపీల సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. మీకు అన్ని తెలుసు కాబట్టి .. మీరే ఇన్ఛార్జ్గా వుండాలని దిగ్విజయ్ సింగ్ను కోరారు మాజీ ఎంపీలు. అయితే ఈ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారు దిగ్విజయ్. నాకెందుకులెండీ అని కొట్టిపారేశారు . అయితే ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరారు మాజీ ఎంపీలు. 2014 నుంచి పార్టీలో ఈగో ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నామని వారు దిగ్విజయ్కు తెలిపారు.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేతలకు ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు దిగ్విజయ్. అలాగే గాంధీ భవన్లో మాజీ ఎమ్మెల్యే అనిల్తో ఘర్షణకు దిగిన ఓయూ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది టీపీసీసీ క్రమశిక్షణా సంఘం. మొత్తం 8 మంది ఓయూ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Also Read: కాంగ్రెస్లో కోవర్టు ఎవరూ లేరు.. అపోహ మాత్రమే: దిగ్విజయ్తో భేటీ తర్వాత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు..
కాగా.. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా వున్న మాణిక్యం ఠాగూర్పై గత కొంతకాలంగా సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. తమ మాటకు గాంధీ భవన్లో విలువ వుండటం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ను వీడిన పలువురు నేతలు ఠాగూర్పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ మార్పుపై దిగ్విజయ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.