Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌లో కోవర్టు ఎవరూ లేరు.. అపోహ మాత్రమే: దిగ్విజయ్‌తో భేటీ తర్వాత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు..

అంతర్గతంగా మాట్లాడుకున్న విషయాలను బహిరంగంగా తెలియజేయడం సరికాదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఎవరూ లేరని చెప్పారు. 
 

Jana reddy Says No Coverts in congress after meeting with digvijaya singh
Author
First Published Dec 22, 2022, 4:55 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య నెలకొన్న విభేదాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన పార్టీ అధిష్టానం దూత దిగ్విజయ్ సింగ్‌ గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పలువురు నేతలతో విడివిడిగా సమావేశమవుతున్నారు. పార్టీలో పరిస్థితులపై, నేతల వైఖరిపై, నేతల అభిప్రాయ భేదాలకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా దిగ్విజయ్‌ సింగ్‌తో సమావేశమైన చర్చించారు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ.. అంతర్గతంగా మాట్లాడుకున్న విషయాలను బహిరంగంగా తెలియజేయడం సరికాదని అన్నారు. అన్ని అంశాలపై దిగ్విజయ్ సింగ్ మీడియాకు వెల్లడిస్తారని చెప్పారు.

పార్టీ ఐక్యతగా ఉండటానికి, అందరం కలిసి పార్టీని పటిష్టం చేయడానికి, అపోహలను  తొలగించుకోవడం ఎలా అనేక అంశాలపై దిగ్విజయ్‌ సింగ్‌తో చర్చించినట్టుగా తెలిపారు. వీటిపై దిగ్విజయ్ సింగ్‌కు తాను కూడా కొన్ని సలహాలు ఇచ్చినట్టుగా చెప్పారు. పార్టీ నేతలు అందరం పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో అందరం ఐకమత్యంతో ముందుకు వస్తామని తెలిపారు. పార్టీలో కోవర్టులు ఎవరూ లేరని అన్నారు. కోవర్టులు ఎవరూ లేరని.. అది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు. 

ఇక, దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అనంతరం ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న సమస్యలను అధిష్టానం పరిష్కరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందరూ నేతలు కూడా ఒక్క అడుగు తగ్గి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం సీనియర్లు పనిచేస్తున్నారని, తాము కూడా ఐదారేళ్లుగా పనిచేస్తున్నామని చెప్పారు. అందరం ఈగోలు పక్కనబెట్టి కలిసికట్టుగా పనిచేయాలన్నదే తన అభిప్రాయమని తెలిపారు. తాను రేవంత్ రెడ్డి మనిషిని అయితే.. సీఎల్పీ నేత చెప్పిన పనులు ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. అసెంబ్లీలో సీఎల్పీ నేత చెప్పినట్టుగానే వ్యవహరించామని చెప్పారు. పార్టీలో తనవంతు పాత్రను తాను పోషిస్తానని చెప్పారు.  

పాతోళ్లు, కొత్తోళ్లు ఎవరిదైనా తప్పు ఉంటే మాత్రం వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. వలసవాదులు అనే మాట బాధ అనిపించిందని అన్నారు. తాము కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నామని చెప్పారు. వలసవాదులు అనే పదానికి మాత్రమే తాను బాధపడి రాజీనామా చేసినట్టుగా చెప్పారు. పార్టీని ఇబ్బంది పెట్టాలని, సీనియర్లను బద్నాం చేయాలని పదవులకు రాజీనామా చేయలేదని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios