టీ కాంగ్రెస్లో ముదిరిన సంక్షోభం.. పీసీసీ పదవులకు సీతక్క, నరేందర్ రెడ్డి సహా పలువురు రాజీనామా..!
పీసీసీ కమిటీలతో తెలంగాణ కాంగ్రెస్లో మొదలైన సంక్షోభం మరింత ముదిరింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన కామెంట్స్ నేపథ్యంలో తీవ్ర మనస్థాపం చెందిన టీడీపీ బ్యాగ్రౌండ్ ఉన్న 10 మందికి పైగా నేతలు టీపీసీసీ కమిటీల పదవులకు రాజీనామా చేశారు.
పీసీసీ కమిటీలతో తెలంగాణ కాంగ్రెస్లో మొదలైన అసమ్మతి రోజురోజుకు తీవ్రతరం అవుతుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పలువురు సీనియర్ నాయకులు శనివారం ఉమ్మడి గళం వినిపించారు. అసలైన కాంగ్రెస్ వాదులు, వలసవాదులు అనే చర్చను తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్లో పరిస్థితి మరింత దిగజారింది. సీనియర్ నాయకులు చేసిన కామెంట్స్తో కలత చెందిన టీడీపీ బ్యాగ్రౌండ్ ఉన్న 10 మందికి పైగా నేతలు పీసీసీ కమిటీల పదవులకు రాజీనామా చేశారు. వారిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఉన్నారు. వారి రాజీనామా లేఖను టీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్కు పంపారు. తమ పదవులను పదవులు రానివారికి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
రాజీనామా చేసినవారిలో వేం నరేందర్ రెడ్డి, సీతక్క, విజయరామారావు, చారకొండ వెంకటేష్, ఎర్ర శేఖర్, పటేల్ రమేష్, సత్తు మల్లేష్.. తదితరులు ఉన్నారు. వీరంతా రేవంత్ రెడ్డి వర్గానికే చెందినవారే. తాము భయపెట్టడానికి కాదని.. పదవులు లేకున్నా పార్టీ కోసం పనిచేస్తామని సీతక్క చెప్పారు. పార్టీ మంచి కోసమే రాజీనామా చేస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే.. మరోవైపు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీకి శనివారం సీఎల్పీ నేత భట్టి నివాసంలో సమావేశమైన సీనియర్ నేతలు గైర్హాజరయ్యారు.
తీవ్ర అసంతృప్తి..
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన కామెంట్స్ నేపథ్యంలో టీడీపీ నుంచి హస్తం పార్టీలో చేరిన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము పార్టీలో చేరి చాలా కాలం అవుతుందని.. పార్టీ కోసం పనిచేస్తున్నామని.. అలాంటి తమపై వలవసవాదులు అని ముద్ర వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వలస నేతలు అని కామెంట్ చేయడం పట్ల వారంతా తీవ్ర మనస్థాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు నేతలు తమ అసంతృప్తిని రేవంత్ రెడ్డి వద్ద వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సీనియర్ల విమర్శలకు సమాధానంగా.. పీసీసీ కమిటీల పదవులకు రాజీనామా చేసినట్టుగా సమాచారం. తాము పదవులను ఆశించడం లేదని.. పార్టీ కోసం పనిచేసేవాళ్లమని వారు చెబుతున్నారు.
ఇక, శనివారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో ఉత్తమ్ కుమార్, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మధుయాష్కిలతో పాటు పలువురు సీనియర్ నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం నేతలు మాట్లాడుతూ.. ఒర్జినల్ కాంగ్రెస్ నినాదంతో.. వలస వచ్చిన నేతల వల్ల పార్టీని నమ్ముకున్న వాళ్లకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉమ్మడి గళం వినిపించారు. టీపీసీసీ కమిటీల్లో బయటి నుంచి వచ్చినవారికే.. ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకే ఎక్కువ పదవులు దక్కాయని చెప్పారు. రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించనప్పటికీ.. వలస నాయకుడు, నాలుగు పార్టీలు మారిన వ్యక్తి తెలంగాణలో కాంగ్రెస్ను ఉద్దరిస్తారా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికో, ఇంకొకరికి అప్పజెప్పాలనో కుట్ర జరుగుతుందని కూడా ఆరోపించారు. తాము కాంగ్రెస్లోనే పుట్టామని, కాంగ్రెస్లోనే ఉన్నామని, కాంగ్రెస్లోనే చస్తామని నేతలు స్పష్టం చేశారు. అసలైన కాంగ్రెస్వాదులకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమని.. అందుకే సేవ్ కాంగ్రెస్ కార్యక్రమంతో ముందుకు వెళ్లనున్నట్టుగా ప్రకటించారు.
ఉత్తమ్ కామెంట్స్తో రచ్చ..
ఇటీవల ప్రకటించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్లో ఎక్కువ మంది బయటి పార్టీ నుంచి వచ్చినవారు ఉండటం కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదని మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్లో.. 50 మందికి పైగా టీడీపీ నుంచి వచ్చినవాళ్లే ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వాదనలో నిజం లేదని టీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు మల్లు రవి స్పష్టం చేశారు.
22 మంది సభ్యులతో కూడిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీలో రేవంత్రెడ్డి మినహా టీడీపీలోకి వచ్చిన వారు ఎవరూ లేరని మల్లు రవి చెప్పారు. 40 మందితో కూడిన ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇద్దరు మాత్రమే ఉన్నారని ఆయన చెప్పారు. 24 మంది ఉపాధ్యక్షులలో ఐదుగురు, 84 ప్రధాన కార్యదర్శులలో ఐదుగురు మాత్రమే టీడీపీ నుంచి వచ్చినవారు ఉన్నారని అన్నారు. 26 జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి సంబంధించి టీడీపీకి చెందిన వారెవరూ లేరని చెప్పారు. కొత్తగా విడుదల చేసిన ఆఫీస్ బేరర్ల జాబితాలో 68 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు ఉండగా, మిగిలిన వారు ఇతర కులాలకు చెందిన వారని చెప్పారు.