మహబూబాబాద్ లో  ఇవాళ జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో  తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.   

మహబూబాబాద్:కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలు తప్ప, సంక్షేమం ఉండదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. మహబూబాబాద్ లో శుక్రవారంనాడు జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు.;పాలేరులో ఎన్నికల సభలో పాల్గొన్న తర్వాత నేరుగా మహబూబాబాద్ కు కేసీఆర్ చేరుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ రైతాంగానికి ఐదు గంటల కంటే ఎక్కువ సేపు విద్యుత్ ను సరఫరా చేయడం లేదన్నారు. కర్ణాటక రైతులు తెలంగాణకు వచ్చి ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణ వచ్చింది కాబట్టే మహబూబాబాద్ జిల్లా అయిందన్నారు. మారుమూల ప్రాంతమైనా పట్టుబట్టి జిల్లాగా ఏర్పాటు చేసిన విషయాన్ని కేసీఆర్ చెప్పారు. సమైక్య రాష్ట్రంలో మన ఓట్లు తీసుకొని మన బాధలు పట్టించుకోలేదన్నారు. గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజీని కూడ ఏర్పాటు చేసుకున్నామన్నారు. 

జిల్లాలోని తండాల్లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి కలకలలాడుతుందన్నారు. రైతు బంధు అవసరం లేదని మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారన్నారు. రైతు బంధు ఉండాలా వద్దా అని ఆయన ప్రశ్నించారు. రైతు బంధు వద్దన్న వారికి బుద్ది చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. 

also read:ఎవరికి ఎవరు అన్యాయం చేశారు: పాలేరులో తుమ్మలకు కేసీఆర్ కౌంటర్

తెలంగాణలో రైతాంగానికి వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ లో కూడ వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా కావడం లేదన్నారు. ధరణిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారన్నారు. ధరణిని ఎత్తివేస్తే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు.

ధరణి పోర్టల్ తో భూకబ్జాలు తగ్గిపోయాయని కేసీఆర్ చెప్పారు. రైతుల భూమి మీద రైతుకు మాత్రమే అధికారం ఉండాలని ధరణిని తీసుకువచ్చినట్టుగా కేసీఆర్ తెలిపారు. ధరణి లేకపోతే రైతుబంధు, రైతు భీమా ఉండదన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని భట్టి విక్రమార్క చెబుతున్నారన్నారు. ధరణిని వద్దంటున్న కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో వేయాలని కేసీఆర్ కోరారు.

 ప్రతి రోజూ కనీసం మూడు ఎన్నికల సభల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారు. తెలంగాణలో మూడో దఫా అధికారాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. తెలంగాణలో తొలిసారి అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు కష్టపడుతున్నాయి. మూడు పార్టీలు తమ అస్త్రశస్త్రాలతో ప్రజలను తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి.వచ్చే నెల 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.ఈ నెల 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.