తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రమే : సీఎం కేసీఆర్
- శాసనమండలిలో బడ్జెట్ చర్చకు కేసిఆర్ సమాధానం
- బిజెపిపై విమర్శలు
- కేంద్ర బడ్జెట్ కూడా దుబారా అనాలా? అని విమర్శ
భారత దేశంలో తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర రెవెన్యూలో 22 శాతం అభివృద్ధిని సాధించామని తెలిపారు. శాసనమండలిలో బడ్జెట్పై చర్చకు కేసిఆర్ సమాధానం చెబుతూ కీలక కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్ను విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకుని మాట్లాడే పరిణితి రావాలన్నారు. బడ్జెట్ చప్పగా ఉంది... అంకెల గారడీ అనడం సరికాదన్నారు సీఎం. బడ్జెట్పై పూర్తి అవగాహనతో సభ్యులు మాట్లాడాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టగానే విమర్శలు చేయడం సరికాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 నుంచి 2014 మధ్యకాలంలో 23 జిల్లాలకు ఖర్చు పెట్టింది రూ.ఒక లక్ష 29 వేల కోట్లు మాత్రమే అన్నారు. ఈ నాలుగేళ్లలో తెలంగాణలో ఖర్చు పెట్టింది రూ. ఒక లక్షా 24 వేల కోట్లు అని చెప్పారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉంటదని ఉద్యమ సమయంలో చెప్పాం... అదే జరుగుతుంది అని పేర్కొన్నారు. ఈ సంవత్సరం దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని అవార్డులు తెలంగాణకు వచ్చాయన్నారు. దేశం 82 లక్షల కోట్ల అప్పులు చేసింది మన దేశమే దారుణంగా విఫలమైందన్నారు.
దేశం రూ. 82 లక్షల కోట్లు అప్పు చేసిందని తెలిపారు. అందులో మోదీ ప్రభుత్వం రూ. 24 లక్షల కోట్ల అప్పులు చేసిందని వెల్లడించారు. ఈ అప్పును దుబారా అని అనగలమా? అని సీఎం ప్రశ్నించారు. 30 ఏళ్ల కిందట చైనా జీడీపీ మనకంటే తక్కువ అని గుర్తు చేశారు. ప్రస్తుతం చైనా జీడీపీలో మనది నాలుగో వంతు ఉంది అని సీఎం తెలిపారు. కేంద్రం బడ్జెట్లో మూడో వంతు అప్పులకే పోతుందన్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం అని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేస్తే తప్పుబట్టడం సరికాదన్నారు. చిత్తశుద్ధి ఉంటే పనులు పూర్తి అవుతుందన్నారు.