తెలంగాణను సాధించాం.. ఇక జై భారత్ మన నినాదం, సమర శంఖం పూరించాం : కేసీఆర్
కొత్త యుద్ధానికి సమర శంఖం పూరించామన్నారు సీఎం కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో క్రిస్టియన్ మత పెద్దలతో త్వరలో భేటీ అవుతామన్నారు కేసీఆర్.
క్రీస్తు సూచనలు పాటిస్తే ఇతరుల పట్ల ద్వేష భావం వుండదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. జై తెలంగాణ నినాదంతో విజయం సాధించామన్న కేసీఆర్.. ఇక జై భారత్ నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. కొత్త యుద్ధానికి సమర శంఖం పూరించామన్నారు సీఎం కేసీఆర్. భారత్ను ప్రపంచంలోనే గొప్ప శాంతికాముక దేశంగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో క్రిస్టియన్ మత పెద్దలతో త్వరలో భేటీ అవుతామన్నారు కేసీఆర్.
ఇకపోతే.. కేసీఆర్ ఈ నెలాఖరులో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. క్రిస్మస్ తర్వాతి నుంచి దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నెలలోనే బీఆర్ఎస్ విధివిధానాలను ప్రకటించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. నెలాఖరుకల్లా 6 రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కిసాన్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కిసాన్ సెల్ కమిటీలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఇదిలావుండగా.... కేసీఆర్ గత వారం దాదాపు 4 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు .. రాజశ్యామల యాగం నిర్వహించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్లతో కేసీఆర్ చర్చలు జరిపారు. అలాగే వివిధ రైతు సంఘాల నాయకులతో కేసీఆర్ సుధీర్ఘంగా మంతనాలు జరిపారు. ఆబ్కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్లాలని భావిస్తున్న కేసీఆర్ .. కిసాన్ యాత్రలతో రైతులను ఏకతాటిపైకి తేవాలని భావిస్తున్నట్టుగా గులాబీ పార్టీ వర్గాలు తెలిపాయి.
అంతేకాకుండా.. ప్రతి నెల ఒక వారం రోజుల పాటు ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం నుంచే పనిచేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే నెల నుంచే ఈ విధమైన ప్రణాళికను అమలు చేయనున్నట్టుగా సమాచారం. పార్టీ ఎంపీలు, రైతు నేతలతో సమావేశమైన సందర్భంగా కేసీఆర్ తన ప్రణాళికలపై చర్చించారని గులాబీ పార్టీ వర్గాలు తెలిపాయి. మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత నెలకు రెండు వారాల పాటు కేసీఆర్ ఢిల్లీలో ఉండనున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ఐదు నెలల తేడా ఉన్నందున.. రెండు ఎన్నికలపై దృష్టి సారించేందుకు ఇటు హైదరాబాద్, అటు ఢిల్లీలో అందుబాబులో ఉండేలా షెడ్యూల్ను రూపొందించుకోనున్నారు.