ఉద్యోగులతో రేపు భేటీ: ప్రగతి భవన్ లో ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ లంచ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 31వ తేదీన ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ఉద్యోగ సంఘాలకు ఈ నెల 29వ తేదీన వరాలు కురిపించారు సీఎం కేసీఆర్.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 31వ తేదీన ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ఉద్యోగ సంఘాలకు ఈ నెల 29వ తేదీన వరాలు కురిపించారు సీఎం కేసీఆర్.
వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పురస్కరించుకొని ఉద్యోగ సంఘాలకు సీఎం వరాలు కురిపించారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనుహ్యమైన స్థానాలను గెలుచుకొంది. నాలుగు స్థానాల నుండి బీజేపీ 48 స్థానాలకు ఎగబాకింది.
ఈ రెండు ఎన్నికల్లో కూడ పోస్టల్ బ్యాలెట్లలో అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లుు పోలయ్యాయి. దీంతో ఉద్యోగులను తమ వైపునకు తిప్పుకొనేందుకు టీఆర్ఎస్ చీఫ్ ఉద్యోగ సంఘాలతో భేటీకి నిర్ణయం తీసుకొన్నారనే చర్చ సాగుతోంది.ఉద్యోగులు పీఆర్సీ కోసం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలి పీఆర్ సీ నివేదిక మరో వారం రోజుల్లో ప్రభుత్వానికి చేరే అవకాశం ఉంది.
ఈ నివేదిక రెండు లేదా మూడంచెల ఫిట్ మెంట్ ను సిఫారసు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ ఈ నెల 31వ తేదీన భేటీ కానున్నారు. ఉద్యోగులతో కలిసి సీఎం కేసీఆర్ మధ్యాహ్నభోజనం చేయనున్నారు.ఉద్యోగులు తమ సమస్యలపై ఈ సందర్భంగా కేసీఆర్ తో చర్చించే అవకాశం లేకపోలేదు.