దేశంలోని పరిస్ధితిపై అసెంబ్లీలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. తాను చెప్పినదాంట్లో ఒక్క అబద్ధం వున్నా రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలని సీఎం నిలదీశారు. 

మేకిన్ ఇండియా జోకింగ్ ఇండియా అయ్యిందని.. తాను చెప్పినదాంట్లో ఒక్క అబద్ధం వున్నా రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ విసిరారు. తన మాటలకు కట్టుబడి వుంటానని.. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని ముంచాయని సీఎం ఆరోపించారు. కాంగ్రెస్‌ది లైసెన్స్ రాజ్ అని.. మోడీది సైలెన్స్ రాజ్ అని కేసీఆర్ సెటైర్లు వేశారు. ఎన్‌డీఏ అంటే నో డేటా అవైలబుల్ అని.. ఏం అడిగినా ఎన్‌డీఏ అంటారంటూ ఆయన విమర్శించారు. దేశ ఆర్ధిక మంత్రి వచ్చి డీలర్‌తో కొట్లాడిందని.. ఏం సాధించారని మోడీ ఫోటో పెట్టాలని కేసీఆర్ ప్రశ్నించారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలని సీఎం నిలదీశారు. 

కాంగ్రెస్ వాళ్లకు భావ దారిద్రం వుందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కాంగ్రెస్‌వాళ్లు చేసిన పనిని కూడా చెప్పుకోలేకపోతున్నారని ఆయన చురకలంటించారు. మన్మోహన్ హయాంలో 14 శాతం అప్పులు తగ్గించారని.. మోడీ హయాంలో 54 శాతం అప్పులు పెరిగాయని కేసీఆర్ ఆరోపించారు. మోడీకి ఓట్లు అవసరమైతే బియ్యం ఫ్రీ అంటారని ఆయన చురకలంటించారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూపాయి పతనమైందని కేసీఆర్ ధ్వజమెత్తారు. మోడీ తెచ్చిన ఏ పాలసీ సక్సెస్ అయ్యిందని సీఎం ప్రశ్నించారు. నోట్ల రద్దు సక్సెస్ అయ్యిందా .. పెద్ద నోట్ల రద్దుకు ముందు నాకు ఎన్నో చెప్పారని, తాను కూడా నమ్మానని కేసీఆర్ తెలిపారు. కానీ నోట్ల రద్దు తర్వాత మనీ సర్క్యులేషన్ పెరిగిందని.. ఒక్క పోర్ట్ వున్న సింగపూర్ కంటే అధ్వాన్నంగా వున్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 

ALso REad: ఈడీకి, బోడికి బీబీసీ భయపడదు ..అదేమైనా జీ న్యూసా : డాక్యుమెంటరీపై మోడీకి కేసీఆర్ చురకలు

ఒక్క వందే భారత్ రైలును మోడీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని కేసీఆర్ సెటైర్లు వేశారు. బర్రె గుద్దితే వందే భారత్ రైలు పచ్చడైందని.. కేంద్ర మంత్రి లిఫ్ట్‌లను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారంటూ సీఎం సెటైర్లు వేశారు. ఇదేనా దేశాన్ని నడిపే పద్ధతని కేసీఆర్ ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం జనాభా లెక్కలు ఎందుకు చేయడం లేదని ఆయన నిలదీశారు. 140 ఏళ్ల చరిత్రలో ఒక్కసారి కూడా జనాభా లెక్కలు ఆగలేదని.. ప్రపంచ యుద్ధాలు వచ్చినా జనగణన ఆగలేదని కేసీఆర్ గుర్తుచేశారు. తన బండారం బయటపడుతుందనే మోడీ జనగణన చేయడం లేదని సీఎం ఆరోపించారు. జనాభా లెక్కలు లేకుండా ఏ దేశం కూడా పాలన చేయడం లేదని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వం తాము చెప్పిందే చేయాలని లేదంటే చంపుతామని అన్నట్లుందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. సందు దొరికితే తెలంగాణను బద్నాం చేయాలనే ఆలోచనలో వున్నామని.. కాంగ్రెస్, బీజేపీ రెండూ దొందూ దొందేనని సీఎం చురకలంటించారు.