Asianet News TeluguAsianet News Telugu

సోనియా ఆశీస్సులతో సీఎం పదవి:డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ గ్రాడ్యుయేషన్ డేలో రేవంత్

హైద్రాబాద్ బాగ్ లింగంపల్లిలోని గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్  లా కాలేజీ గ్రాడ్యుయేషన్ డే ఇవాళ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 

  Telangana Chief Minister Anumula Revanth Reddy interesting comments on Chief Minister Post lns
Author
First Published Dec 22, 2023, 5:24 PM IST

హైదరాబాద్:   ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల  రేవంత్ రెడ్డి చెప్పారు. 

శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని  బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ గ్రాడ్యుయేషన్ డేలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిని అయ్యానని సీఎం  రేవంత్ రెడ్డి  చెప్పారు.  ఎంతో మంది పోటీలో ఉన్నా కూడా సోనియా గాంధీ తనకు సీఎంగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలన్నారు. ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలవచ్చని సీఎం చెప్పారు. అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమన్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని తెలిపారు. కఠోర దీక్షతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

 రామాయణంలో లవకుశుల లాంటివారు వివేక్, వినోద్  అని ఆయన కొనియాడారు. ఎంత సంపాదించామనేది కాదు.. సమాజానికి ఎంత పంచామనేది సామాజిక బాధ్యతగా ఆయన పేర్కొన్నారు.   ఇదే కాకా విధానమన్నారు. అటువంటి కాకా వెంకటస్వామి వర్థంతి రోజు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం గొప్ప కార్యక్రమమని అన్నారు. గత 50 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చి దిద్దిన ఘనత కాకా సొంతమని ఆయన గుర్తు చేశారు. 

 ఎలాంటి లాభాపేక్ష లేకుండా   విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిదన్నారు.  తెలంగాణ ఉద్యమంలో కాకా ఫ్యామిలీ ముందున్న విషయాన్ని సీఎం రేవంత్  రెడ్డి గుర్తు చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీస్ కూడా కాకా పేరునే ఉందని తెలిపారు. 

  దేశం కోసం గాంధీ కుటుంబం ఎలానో తెలంగాణకు కాకా కుటుంబం అలా అని చెప్పుకొచ్చారు. బీఆర్ అంబేద్కర్ కాలేజీ  విద్యార్థులకు ప్రభుత్వం నుంచి చేయూతనందించేందుకు సిద్దమని రేవంత్ హామీ ఇచ్చారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు తాము అండగా ఉంటామన్నారు.

 రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధిపై కృషి చేస్తామని తెలిపారు. కళాశాల సమయంలో భవిష్యత్ కు బంగారు పునాదులు వేసుకోవాలని సూచించారు. విద్యార్థి దశలోనే వీలైనంత ఎంజాయ్ చేస్తూనే భవిష్యత్ వైపునకు సరైన దిశలో అడుగులు వేయాలని చెప్పారు.

 

 ముఖ్యంగా డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లకు బానిస కాకూడదని ఆయన సూచించారు.  రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యతని సీఎం హామీ ఇచ్చారు.  అంతకుముందు కాలేజీలో కాకా వెంకటస్వామి విగ్రహాన్ని సీఎం రేవంత్ అవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, తదితరులు  పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios