ఈ ఏడాది చివరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు  ఎన్నికల సంఘం  ఏర్పాట్లు చేస్తుది. ఇవాళ  ఆయా జిల్లాల ఎస్పీలు, సీపీలతో  తెలంగాణ సీఈఓ  వికాస్‌రాజ్ సమావేశమయ్యారు.  

హైదరాబాద్: ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఇవాళ పోలీస్ ఉన్నతాధికారులతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ సమావేశమయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హైద్రాబాద్ లోని బీఆర్‌కే భవనంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఎస్పీలు, సీపీలతో తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ భేటీ అయ్యారు.ఈ సమావేశంలో డీజీపీ అంజనీకుమార్, అదనపు డీజీలు కూడ పాల్గొన్నారు. రానున్న ఎన్నికలను పురస్కరించుకొని శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. పోలింగ్ కు ముందు, పోలింగ్ తర్వాత ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై సమావేశంలో దిశా నిర్ధేశం చేయనున్నారు.

ఏయే అసెంబ్లీ నియోజకవర్గాల్లో సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలున్నాయి, ఆ ప్రాంతాల్లో ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై ఉన్నతాధికారులు సూచనలు చేయనున్నారు.ఇప్పటికే రెండు దఫాలు రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణను పూర్తి చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్దం చేశారు.

ఈ సమావేశాన్ని ప్రారంభిస్తూ తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ ప్రసంగించారు.ఈ సందర్భంగా తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టుగా చెప్పారు.సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్ సూచించారు.డబ్బు, మద్యం వివరాల నమోదుకు కేంద్రం యాప్ ను రూపొందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మద్యం, డబ్బు అక్రమ రవాణాపై పోలీసులు కేంద్రీకరించాలని సీఈఓ సూచించారు.

ఈ ఏడాది అక్టోబర్ మాసంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యల గురించి పరిశీలిస్తారు. ఈ పర్యటన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తేదీలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.ఈ ఏడాది అక్టోబర్ మాసంలోనే ఎన్నికల సంఘం ఈ విషయమై ప్రకటన చేసేందుకు కసరత్తు చేస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యటన నాటికి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్దంగా ఉండాలని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు.