కాసేపట్లో తెలంగాణ కేబినెట్: లాక్డౌన్ పై తేల్చనున్న కేసీఆర్
తెలంగాణ కేబినెట్ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో లాక్డౌన్ పై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో లాక్డౌన్ పై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 12వ తేదీ నుండి రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంది. మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తారా లాక్డౌన్ ను ఎత్తివేస్తారా అనే విషయమై స్పష్టతరానుంది.రాష్ట్రంలో 20 గంటల పాటు లాక్డౌన్ అమల్లో ఉంది. ఉదయం ఆరు గంటల నుండి 10 గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోలుకు ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షల నుండి మినహాయింపు ఇచ్చింది.
ఇవాళ్టితో లాక్డౌన్ కు గడువు ముగియనుంది. రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. లాక్డౌన్ ఇప్పటికే మంత్రులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు కూడ నమోదౌతున్న నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగించాలని కొందరు కోరుతున్నారు.
లాక్డౌన్ ను వారం పది రోజుల పాటు పొడిగిస్తూ నిత్యావసర సరుకుల కొనుగోలుకు మరికొన్ని గంటల పాటు మినహయింపు ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం సడలించే అవకాశం లేకపోలేదు. మరో వైపు లాక్డౌన్ ఎత్తివేస్తే వీకేండ్ లాక్ డౌన్ లేదా రాత్రి పూట కర్ఫ్యూ సమయాన్ని పెంచే విషయమై కూడ ప్రభుత్వం ఆలోచిస్తోంది.ఈ విషయమై సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఇదిలా ఉంటే లాక్డౌన్ ను పొడిగించవద్దని హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని కోరారు. లాక్ డౌన్ తో పేదలు బతకడం కష్టంగా మారిందన్నారు. 4 గంటలే మినహయింపు ఇస్తూ బతకాలంటే ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.