టీఆర్ఎస్ ను తరిమికొడదాం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (bandi sanjay) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని తరిమికొడతామనీ, ఈ ఉద్యమంలో ఉద్యమకారులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. “తీన్మార్” మల్లన్న బీజేపీలో చేరడం సంతోషకరమని అన్నారు.
Bandi sanjay: తెరాసపై మరోసారి విరుచక పడ్డారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్(Bandi sanjay) . తెలంగాణలో టీఆర్ఎస్ ను తరిమికొడతాం. ఈ ఉద్యమంలో ఉద్యమకారులంతా కలిసి రండి అని పిలుపు నిచ్చారు. “తీన్మార్” మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరడం చాలా సంతోషమనీ, ఆయనకు బీజేపీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుందని అన్నారు. తీన్మార్ మల్లన్న తెలంగాణలో ప్రశ్నించే గొంతుక అని, ప్రజల ఆధరాభిమానాలు చూరగొన్న వ్యక్తి అని కితాబు ఇచ్చారు.
మల్లన్న నిఖార్సయిన తెలంగాణ ఉద్యమకారుడు బీజేపీలోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. రాజకీయ స్వార్థంతో మల్లన్న బీజేపీలో చేరడం లేదని అన్నారు. మోడీ ప్రభుత్వం అవినీతి రహిత పాలన చేస్తుందనీ, పేదల కోసం పనిచేస్తోంది. కానీ, తెలంగాణలో అందుకు భిన్నంగా పాలన సాగుతోందనీ, రాష్ట్రంలో అవినీతి, రాక్షస, కుటుంబం పాలన సాగుతోందని అన్నారు.
ఇలాంటి ప్రభుత్వం, పరిపాలకుల మీద వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. తన కలంతో గళమెత్తి.. కేసీఆర్ గడీల పాలనను ప్రశ్నించాడు.దీంతో జీర్ణించుకోలేని కేసీఆర్ అక్రమ కేసులు పెట్టి ఆయనను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అని తెలిపారు. అయినా మల్లన్న భయపడకుండా... తాను ఎంచుకున్న దారిలో వెళుతూ తెలంగాణ అమరవీరుల ఆశయం కోసం పోరాడుతున్నారని తెలిపారు. కేసీఆర్ దుర్మార్గ పాలనను అంతమొందించాలంటే అది బీజేపీతోనే సాధ్యమని తెలంగాణ ఉద్యమకారులు భావిస్తున్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ కుటుంబ, అవినీతి, నియంత ప్రభుత్వాన్ని తరిమితరిమి కొట్టాలని,చంద్రశేఖర్ రావు రాక్షస పాలనకు చరమగీతం పాడాలని, బీజేపీ చేపడుతున్న ఈ మహోద్యమానికి మద్దతు పలకాలని రాష్ట్రంలోని తెలంగాణ ఉద్యమకారులను కోరుతున్నానని బండి సంజయ్ స్పష్టం చేసారు.
లక్షలాది మంది యువత తీన్మార్ మల్లన్నను ఫాలో అవుతున్నారని, తన కలంతో గళం ఎత్తితే కేసీఆర్ దుర్మార్గ పాలనను ప్రశ్నించడం సహించలేని కేసీఆర్ సర్కార్ పై మల్లన్నపై అనేక అక్రమ కేసులు పెట్టి.. జైలుకు పంపడం అన్యాయమని తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆవేదన వ్యక్తం చేసారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించేందుకు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ సర్కార్ పీఠం కదులుతోందని తరుణ్ చుగ్ అన్నారు. అలాగే.. అవినీతి పాలనపై పోరాడుతున్న మల్లన్న బీజేపీలో చేరడాన్ని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని అరవింద్ స్పష్టం చేసారు.
బీజేపీలో నేడు తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మల్లన్నకు సభ్యత్వమిచ్చి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
తీన్మార్ మల్లన్నకు తెలంగాణలో ఎలాంటి ప్రజాభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నడుపుతున్న Q News యూట్యూబ్ ఛానల్ కు 1.41M subscribers ఉన్నారు. ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 1.40 లక్షల ఓట్లకుపైగా సాధించి రెండో స్థానంలో నిలిచారు. మల్లన్నను ఓడించడానికి అధికార పార్టీ కోట్ల రూపాయాలను ఖర్చు చేసింది. నిత్యం ఆయన యూట్యూబ్ ఛానల్ లో కేసీఆర్ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించడంతో అక్రమ కేసులు బనాయించి..జైలు పాలు చేశారు. విడుదలైన తరువాత మల్లన్న అనూహ్యంగా బీజేపీలో చేరడం గమనార్హం.