12 వందల మంది ఆత్మబలిదానాల మీద కేసీఆర్ కుర్చీ : డీకే అరుణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడ్డారు బీజేపీ నేత డీకే అరుణ. బీజేపీపై కేసీఆర్ దుష్ప్రచారాలు చేస్తున్నారని.. నీళ్లు, నిధులు, నియామకాలపై సీఎం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ రాని కేసీఆర్ ఇప్పుడు ఉప ఎన్నిక కోసం మునుగోడుకు వచ్చారని విమర్శించారు బీజేపీ నేత డీకే అరుణ. ఆదివారం మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. మాయ మాటలు చెప్పి కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 12 వందల మంది ఆత్మబలిదానాల మీద కేసీఆర్ కుర్చి వేసుకుని కూర్చున్నారని డీకే అరుణ దుయ్యబట్టారు. బీజేపీపై కేసీఆర్ దుష్ప్రచారాలు చేస్తున్నారని.. నీళ్లు, నిధులు, నియామకాలపై సీఎం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇదే సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ నిన్న మునుగోడులో మీటింగ్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పే సత్తా బీజేపీకి ఉందన్నారు. ఎవరైతే అవినీతికి, అక్రమాలకు పాల్పడతారో వాళ్లే ఈడీ, సీబీఐలకు భయపడతారని అన్నారు. ఈడీ, సీబీఐ విషయంలో కేంద్రం ఎక్కడ జోక్యం చేసుకోదని కిషన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ పోరపాటు చేయకుంటే దర్యాప్తు సంస్థలకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్కు దురద పెడితే ఆయనే గోక్కోవాలని సెటైర్లు వేశారు.
Also REad:తెలంగాణ తల్లికి విముక్తి కల్పించేందుకే అమిత్ షా వచ్చారు.. కిషన్ రెడ్డి
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్తో అంటకాగేవారిని, పొత్తు పెట్టుకునేవారిని తెలంగాణ ప్రజలు క్షమించరని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. హుజురాబాద్ కంటే మునుగోడు చైతన్యవంతమైన గడ్డ అని అన్నారు. టీఆర్ఎస్ ఓడిపోతే ఇక్కడ మీటర్లు పెడతారని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ సభ విజయవంతం కావద్దని కేసీఆర్ కుట్ర చేసి.. ఒక్క రోజు ముందు సభ పెట్టారని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేత ప్రధాని మోదీ అని చెప్పారు. ఈ ఎనిమిదేళ్లలో సీపీఐ నేతలు ఎప్పుడైనా ప్రగతిభవన్కు వెళ్లారా అని ప్రశ్నించారు. 8 ఏళ్లలో ఎప్పుడైనా ట్రేడ్ యూనియన్లతో కేసీఆర్ చర్చించారా అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ధర్నాలే ఉండొద్దని కేసీఆర్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ను ఎత్తేశారని అన్నారు. కేసీఆర్ చేసిన ద్రోహాలు కమ్యూనిస్టు మర్చిపోయారా అని ప్రశ్నించారు. వామపక్ష పార్టీలు ఒకసారి ఆలోచన చేయాలని అన్నారు.