మూడెకరాల భూమి, దళిత బంధు ఏమయ్యాయి.. ఎస్సీలను మోసం చేయడమే : కేసీఆర్పై బండి సంజయ్ ఫైర్
తెలంగాణలో ఎస్సీలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మూడు ఎకరాల భూమి, దళిత బంధు ఇస్తామంటూ ముఖ్యమంత్రి మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ (bjp) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నారాయణపేటలో (narayanpet) ఆదివారం ఆయన మాట్లాడుతూ... మూడు ఎకరాల భూమి, దళిత బంధు ఇస్తామంటూ ఎస్సీలను సీఎం కేసీఆర్ (kcr) మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో చిన్న రోడ్లకు కూడా ప్రభుత్వం మరమ్మతులు చేయలేకపోతోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే సీఎం కేసీఆర్ ఆ నిధులను వాడుతూ తన పథకాలుగా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ హామీలు ఇచ్చిన కేసీఆర్ అన్నింటినీ మర్చిపోయారని, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. అలాగే, ఆరు నెలల్లో ఆర్డీఎస్ (rds) పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, అయినప్పటికీ ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
అంతకుముందు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల కాదని, తమ పార్టీ దివంగత నాయకురాలు సుష్మా స్వరాజ్ (sushma swaraj) వల్ల అని బండి సంజయ్ చెప్పారు. ఆమె లేకపోతే తెలంగాణ వచ్చేదా? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు అనుభవిస్తోన్న పదవులు బీజేపీ పెట్టిన భిక్షేనన్నారు
కాంగ్రెస్ పార్టీ (congress) ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే బీజేపీ ఇస్తుందని సుష్మా పేర్కొన్నారని బండి సంజయ్ గుర్తుచేశారు. ఒకవేళ పార్లమెంటులో కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పెట్టకుంటే బీజేపీ ప్రైవేట్ బిల్లు పెడుతుందని సుష్మా స్వరాజ్ చెప్పారని ఆయన వెల్లడించారు.. అందుకు భయపడే కాంగ్రెస్ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టిందని బండి సంజయ్ గుర్తుచేశారు.
పెట్రోల్, డీజిల్ గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్కు లేదని ఆయన ఫైరయ్యారు. దేశంలో తెలంగాణలోనే పెట్రో ధరలు అత్యధికంగా ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. చమురుపై కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు ఎక్సైజ్ సుంకం తగ్గించిందని, 18 రాష్ట్రాలు తాము విధించే పన్నులను తగ్గించాయని ఆయన గుర్తుచేశారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారి కూడా తగ్గించలేదని, అంతేకాకుండా రాష్ట్రంలో వ్యాట్ పేరుతో లీటరుకు రూ.35 వసూలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.