కేసీఆర్ గద్దె దిగాల్సిందే.. లేకుంటే తెలంగాణకు శ్రీలంక గతే, బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి : బండి సంజయ్
రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన పోకుంటే తెలంగాణకూ శ్రీలంక గతేనన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం దోచేసిందని... చివరికి పంచ భూతాలను సైతం వదల్లేదన్నారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.
గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా రెపరెపలాడిస్తామన్నారు తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) . తుక్కుగూడలో జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర (praja sangrama yatra) ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. హామీలు నెరవేర్చకుండా కేసీఆర్ (kcr) మోసం చేశారని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే ప్రసక్తే లేదని బండి సంజయ్ జోస్యం చెప్పారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తోందని.. తెలంగాణ ప్రజలను కాపాడుకోవడం కోసమే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు.
పంచ భూతాలను కూడా వదిలిపెట్టడం లేదని.. ఒకే కుటుంబం పాలించిన శ్రీలంక (srilanka crisis) పరిస్ధితి ఎలా వుందో చూడాలని బండి సంజయ్ గుర్తుచేశారు. కేసీఆర్ పాలన పోకపోతే మనకూ అదే పరిస్ధితి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కీలక శాఖలన్నీ కేసీఆర్ కుటుంబం చేతుల్లోనే వున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి పేదోడికి ఇల్లు కట్టిస్తామని.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలేనన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. అధికారం అందరికీ ఇచ్చారని... బీజేపీకి ఒక్కసారి ఇవ్వాలని ఆయన కోరారు.
ధరణి పేరుతో ప్రజల భూములను టీఆర్ఎస్ నేతలు లాక్కొన్నారని బండి సంజయ్ ఫైరయ్యారు. పాలమూరు ప్రజలు ఇంకా ఎడారి పరిస్ధితుల్లోనే వున్నారని.. ఆర్డీఎస్ను పూర్తి చేసే బాధ్యత తనదేనని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇచ్చారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఒకసారి వరి వేయమంటారని.. మరోసారి పత్తి వేయమంటారని, తుగ్లక్ నిర్ణయాలతో తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నారని ఆమన మండిపడ్డారు. తనకు 18 వేల అర్జీలు వస్తే.. అందులో 60 శాతం ఇళ్లులేని పేదోళ్లవేనని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని.. రాష్ట్రంలో వ్యాట్ సవరించి పెట్రోల్, డీజిల్ రేటు తగ్గిస్తామని ఆయన పేర్కొన్నారు. ఫసల్ బీమా యోజనతో రైతాంగాన్ని ఆదుకుంటామని.. ఉచిత విద్య, ఉచిత వైద్యం హామీలను కచ్చితంగా నెరవేర్చుకుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు.