కేసీఆర్ కుటుంబంలో సీఎం కుర్చీ కోసం లొల్లి మొదలు : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. సీఎం కుర్చీ కోసం కేసీఆర్ ఫ్యామిలీలో లొల్లి మొదలైందన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ముథోల్ నియోజకవర్గ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎనిమిదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రగతి భవన్ వదిలి బయటకు రాలేదని దుయ్యబట్టారు. ఇలాంటి సీఎంను చూసి దేశం మొత్తం నవ్వుకుంటోందని, తెలంగాణ ఇజ్జత్ పోతోందన్నారు. తెలంగాణ వచ్చాక రైతులు, నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు మరింత పెరిగాయని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటర్మీడియట్ చదివే చిన్న పిల్లలు 37 మంది ఆత్మహత్య చేసుకున్నారని, వారంతా ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే పేదల పిల్లలేనని ఆయన తెలిపారు. డబుల్ బెడ్రూంలు ఎక్కడ అని సంజయ్ ప్రశ్నించారు. జాగా వున్నవాళ్లకు 5 లక్షలు ఇస్తామన్నారని... ఎవరికి ఇచ్చారని సంజయ్ నిలదీశారు. ఇళ్ల కోసం లేఖ రాస్తే.. లెక్కలు చెప్పడం లేదని ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీదే అధికారమని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ప్రతీ పైసా మోడీనే ఇస్తున్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ALso REad:తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది..: టీఆర్ఎస్ పై బండి సంజయ్ విమర్శలు
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్లకు పైగా నిధులిస్తే , కేసీఆర్ ఆ సొమ్మును దారి మళ్లించాడని ఆయన ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మళ్లీ కొత్త డ్రామాలకు తెరలేపారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబంలో సీఎం కుర్చీ కోసం లొల్లి స్టార్ట్ అయ్యిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవితపై ఎన్ని కేసులు వున్నాయో ప్రజలకు తెలుసునన్నారు. ఐదేళ్లలో దేశం కోసం, ధర్మం కోసం తాను ఎన్నోసార్లు జైలుకు వెళ్లానని.. ప్రజల కోసం ఉద్యమం చేస్తుంటే రౌడీషీట్లు పెట్టి జైలుకు పంపుతున్నాడని బండి సంజయ్ మండిపడ్డారు. బీసీ కులాలను కేసీఆర్ మోసం చేశాడని.. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నాడని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ గడీల్లో తెలంగాణ తల్లి బందీ అయ్యిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.