లిక్కర్ స్కాం దృష్టి మరల్చేందుకే.. వైసీపీతో కలిసి కేసీఆర్ స్కెచ్ : సజ్జల వ్యాఖ్యలపై బండి సంజయ్
ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కేసీఆర్ వైసీపీ నేతలతో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. సజ్జల వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిసిపోవాలంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. వీటపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత లిక్కర్ స్కామ్ పక్కకు పోయేందుకు వైసీపీ నేతలతో కలిసి కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి డ్రామాలు ఆడుతున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల ఒప్పందంతో స్కామ్లు విషయం పక్కకు పోయేందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అంతకుముందు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే తమ పార్టీ విధానమన్నారు. రెండు రాష్ట్రాలు కలసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుందన్నారు. రెండు రాష్ట్రాలు కలిసే దానికోసం వైకాపా పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ తమ పార్టీ పోరాడుతుందన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ పనిగట్టుకుని జగన్ వైపు చూపించినట్లు తెలుస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ ,బీజేపీలు విభజనకు అనుకూలంగా వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ALso REad:విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగింది.. మళ్లీ రెండు రాష్ట్రాలు కలిస్తే : బొత్స వ్యాఖ్యలు
మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే తొలుత స్వాగతించేది తామేనన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో మా వాదనలు బలంగా వాదనలు వినిపిస్తామన్నారు. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలన్నారు. లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరతామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. విభజన చట్టంలో హామీల అమలు కోసం కాదన్నారు.విభజనచట్టంలో హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉందని ఆయన చెప్పారు.