వినాయక సాగర్ లోనే వినాయకుల నిమజ్జనం: తెలంగాణ బిజెపి చీఫ్
హైదరాబాద్లోని ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ ను వినాయక సాగర్ అని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రస్తావించారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచకపడ్డారు. ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగుతున్నాయి. బీజేపీ నేతలు కూడా కేసీఆర్ సర్కార్, జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్నం పైకి చెబుతున్నది ఒకటి.. జరుగుతున్నది మరొకటని అంటున్నారు.
మరోసారి వినాయక విగ్రహాల నిమజ్జన ఉత్సవాలపై హైదరాబాద్ లో ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో లాగానే హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నా.. హిందూ సంఘాలు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మాత్రం కేసీఆర్ ప్రభుత్వ వ్యవహర తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ నాయకులు కూడా అటూ కేసీఆర్ ప్రభుత్వంపై.. ఇటు జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్నం పైకి ఒకటి చెబుతూ.. మరోకటి చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ట్యాంక్ బండ్ కు వెళ్లి.. వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుస్సేన్ సాగర్ ను వినాయక్ సాగర్ అని ప్రస్తావించారు. వినాయక్ సాగర్ లోనే వినాయక నిమజ్జనం జరుగుతుందని అన్నారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఏటా ఇదే పరిస్థితి నెలకొంటుందనీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వారు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన తర్వాతే ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారుల పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులందరూ.. సద్ది కట్టుకుని ట్యాంక్ బండ్ రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం చేయాలని అన్నారు. ట్యాంక్ బండ్ పై హిందువులు ఇబ్బందులు పడుతుంటే.. దారుస్సలాంలోని ఏఐఎంఐఎం ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరుగుతున్నాయనంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. నిఖార్సైన హిందువని చెప్పుకుంటున్న కేసీఆర్ కు కావాల్సింది ఇదేనా? అని ప్రశ్నించారు.
రాబోయే రెండు రోజుల్లో పెద్దఎత్తున గణేశ్ నిమజ్జనాలు జరగబోతున్నాయనీ, కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. ఉదయం కొన్ని క్రేన్లు మాత్రమే అమర్చారనీ, అందులో కొన్ని ఇంకా పనిచేయలేదని అన్నారు. గతేడాది సుమారు 60 క్రేన్లు అమర్చారనీ, హిందువులు ఈ పరిస్థితి గురించి ఆలోచించాలని అన్నారు. హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని టిఆర్ఎస్ ప్రభుత్వం హిందువుల పండుగలపై చిన్నచూపు చూస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.
తెలంగాణ మున్సిపల్ మంత్రి నాస్తికుడని అన్నారు. కేసీఆర్ హిందుత్వ బండారాన్ని ప్రపంచానికి చాటి చెబుదామని అన్నారు. ఇది ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికాబద్ధమైన కుట్రని అన్నారు. గత 4 లేదా 5 సంవత్సరాలుగా పండుగ విలువను తగ్గించేందుకు.. కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితితో సమావేశం అయ్యాక అనవసర నిబంధనలు పెట్టారనీ, కేవలం గణేష్ విగ్రహం పెట్టాలంటే సౌండ్ పర్మిషన్, హైట్ పర్మిషన్ కావాలి. రెవెన్యూ అనుమతి కావాలనీ, హిందువులు పన్నులు చెల్లించడం లేదా?" తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు.
భాగ్యనగర ఉత్సవ సమితి దీక్షలకు దిగొచ్చి ట్యాంక్ బండ్ పై హడావుడిగా క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారని బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. అయినా నిమజ్జన ఏర్పాట్లు తూతూ మంత్రంగానే ఉన్నాయని మండిపడ్డారు. తెరాస మంత్రుల అబద్దాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శించారు.
వినాయక సాగర్లో జరిగే.. వినాయక నిమజ్జన కార్యక్రమానికి హిందువులందరూ రావాలి. కేసీఆర్ ప్రభుత్వం హిందూ సమాజాన్ని కించపరస్తుందనీ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సాకుగా చూపి సోమవారం హైదరాబాద్లోని ట్యాంక్బండ్లో గణేష్ నిమజ్జనానికి అడ్డంకులు సృష్టిస్తామని బండి సంజయ్ కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెరాస ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్త వాతావరణం సృష్టించడం దురదృష్టకరమని అన్నారు. భక్తుల సౌకర్యార్థం గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వం సహకరించకుంటే సహించబోమనీ, ప్రగతి భవన్ వరకు నిమజ్జనం కోసం పోరాటం చేస్తామని అన్నారు. కేసీఆర్కు హిందూ సమాజం భయపడదనీ, ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన ఓట్లను సంపాదించడానికి శాంతిభద్రతల భంగం కలుగుతోందని సరైన పద్దతి కాదని అన్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ ను వినాయక్ సాగర్ అని ప్రస్తావించడం చర్చనీయంగా మారింది.