మునుగోడులో ఉపఎన్నిక రావాలని టీఆర్ఎస్.. వద్దని కాంగ్రెస్ : బండి సంజయ్ వ్యాఖ్యలు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. మునుగోడులో ఉపఎన్నికలు రావాలని టీఆర్ఎస్ కోరుకుంటుంటే..కాంగ్రెస్ వద్దని కోరుకుంటోందన్నారు.
మునుగోడులో (monagadu ) ఉపఎన్నికలు రావాలని టీఆర్ఎస్ (trs) కోరుకుంటుంటే.. కాంగ్రెస్ (congress) వద్దని కోరుకుంటోందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) . ఈ సారి ఎన్నికల్లో టీఆర్ఎస్కు (trs) 15 సీట్ల కన్నా ఎక్కువ రావన్నారు. పాతబస్తీలోనూ వచ్చే ఎన్నికల్లో పాగా వేస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఏం కోరుకుంటే తాము అటువైపే వుంటామని ఆయన అన్నారు. ఇక గజ్వేల్లో పోటీ చేస్తానంటూ ఈటల ప్రకటనపైనా బండి సంజయ్ స్పందించారు. ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చన్నారు. పోటీలకు సంబంధించి పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని బండి సంజయ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటి వరకు అందరూ భయపడుతూ వున్నారని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో వ్యాపారస్తులు వ్యాపారం చేసే పరిస్థితి కూడా లేదన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో ఈసారి చిన్న చిన్న సమావేశాలే వుంటాయని.. పెద్ద నేతలెవ్వరూ రారని బండి సంజయ్ పేర్కొన్నారు.
అంతకుముందు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత కొంతకాలంగా గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని ఈటల రాజేందర్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కేసీఆర్ టార్గెట్గా ఈటల ఫైర్ అయ్యారు. హుజురాబాద్, గజ్వేల్లల్లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా పర్లేదు అని సవాలు విసిరారు. సీఎం కేసీఆర్ను ఓడగొట్టడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆప్షన్ కేసీఆర్కే వదిలేస్తున్నాని అన్నారు.
Also REad:ఆ రెండు చోట్ల ఎక్కడ పోటీ చేసినా పర్లేదు.. కేసీఆర్కు ఈటల రాజేందర్ సవాలు
ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ లాంటివారే ఓడిపోయారని.. అధికారం ఉందని విర్రవీగద్దని కేసీఆర్పై మండిపడ్డారు. బ్రహ్మదేవుడు కూడా టీఆర్ఎస్ పార్టీని కాపాడలేడని అన్నారు. టీఆర్ఎస్లో కేసీఆర్ కంటే తనకే ఎక్కువ వ్యక్తిగత పరిచయాలున్నాయని అన్నారు. కేసీఆర్పై టీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీలోకి అన్ని పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయని అన్నారు. బీజేపీ తెలంగాణ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.