తెలంగాణలో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచే ప్లాన్.. సాకు ఇదే : బండి సంజయ్ వ్యాఖ్యలు
తెలంగాణలో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైందని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలను సాకుగా చూపి కరెంట్ ఛార్జీలు పెంచాలని చూస్తున్నారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శనివారం జనగామ జిల్లా ఖిలాషపూర్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలపై మరో 4 వేల కోట్ల భారం మోపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో చీకట్లు అలుముకునే ప్రమాదం వుందని.. అందుకే కేంద్రం విద్యుత్ కొనుగోళ్లపై నిషేధం విధించిందని బండి సంజయ్ అన్నారు.
డిస్కమ్లకు తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని .. ఇవి రూ.20 వేల కోట్లకు పైగా వుండగా, తాము రూ.1380 కోట్లు మాత్రమే కట్టాల్సి వుందని కేసీఆర్ సర్కార్ నివేదిక ఇచ్చిందని బండి సంజయ్ ఫైరయ్యారు. మరో అధికారి అయితే కేవలం రూ.50 కోట్లే కట్టాల్సి వుందని అంటున్నారని, ఓ మంత్రి అయితే అసలు ఎలాంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదని అంటున్నారని ఆయన మండిపడ్డారు. దీనిని సాకుగా చూపించి కరెంట్ ఛార్జీలు పెంచాలని సీఎం యోచిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
Also REad:తెలంగాణ విద్యుత్ డిస్కంలు చెల్లించాల్సింది రూ. 52 కోట్లే.. లెక్కలను సరి చేసుకున్న కేంద్రం
కాగా.. తెలంగాణ డిస్కంలు రెండు రోజుల క్రితం నాటికి ఎల్పీఎస్ కింద 52.85 కోట్లు చెల్లించాల్సి ఉందని కేంద్రం చెప్పింది. అయితే అంతకు ముందు కొన్ని రాష్ట్రాలు బకాయిల విషయంలో కేంద్రానికి లెక్కలు సమర్పించాయి. వీటిని చూసిన కేంద్రం అధిక బాకీలు ఉన్న 13 రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. అయితే లెక్కలన్నీ సరిచూసుకున్న తరువాత పలు రాష్ట్రాలపై ఉన్న ఆంక్షలను తొలగించింది. కానీ తెలంగాణ రాష్ట్రంపై ఇంకా ఆ నిషేధం అలానే ఉంది. 52.18 కోట్లు క్లియర్ చేస్తేనే ఆ నిషేధం ఎత్తేస్తామని స్పష్టం చేసింది. రెండు రోజుల కింద బకాయిలు రూ.1360 కోట్లుగా చెప్పిన కేంద్రం తాజాగా వాటిని సవరించింది. కేవలం రూ.52 కోట్లు మాత్రమే బాకీ ఉన్నట్టు చెప్పింది. అయితే దీనిపై కూడా డిస్కంలు అభ్యంతరం తెలుపుతున్నాయి. ఆ మొత్తం కూడా బకాయిలు లేవని చెబుతున్నాయి.
అంత మొత్తం కూడా ఎల్పీఎస్ ఉండదని డిస్కంలు చెబుతున్నాయి. ఈ చర్చల వల్ల నిన్న 20 ఎంయూ కరెంట్ ను కొనుగోలు చేయలేకపోయాయి. అయితే నేడు కూడా దానికి పర్మిషన్ వస్తుందో లేదో తెలియడం లేదు. అయితే రెండు రోజుల కింద 13 వందల 60 కోట్లు బాకీలు ఉన్నట్టు చెప్పిన కేంద్ర అంతలోనే దానిని 52 కోట్లకు ఎలా తగ్గించాయని డిస్కంలు ప్రశ్నించాయి. లెక్కల్లో తేడాలు రావడం వల్లే ఇది జరిగిందని కేంద్రం చెప్పింది. అయితే లెక్కలు సరి చూసుకున్న తరువాత నిషేధం ఉన్న రాష్ట్రాల నుంచి పలు రాష్ట్రాలను తొలగించింది. ఇందులో ఏపీ, మణిపూర్, బీహార్, మహారాష్ట్రలు ఉన్నాయి. మన రాష్టంతో పాటు ఇంకా పలు రాష్ట్రాలపై ఆ ఆంక్షలు అలాగే కొనసాగుతున్నాయి.