Bandi Sanjay: భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ మ‌రోసారి రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. చాలా రోజుల క్రితం కొత్త పింఛ‌న్లు అందిస్తామ‌ని ప్ర‌క‌టించిన స‌ర్కారు.. ఆ ఊసెత్త‌డం మ‌రిచిపోయింద‌ని విమ‌ర్శించారు.  

Aasara pensions: తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రభుత్వం గత మూడేళ్లుగా పింఛన్లు విడుదల చేయడం లేదని తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. పింఛను పథకాలు పొందేందుకు అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామన్న ఎన్నికల హామీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఎంపీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కి లేఖ రాశారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

2018లో టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోని 12వ పేజీలోని పాయింట్ నంబర్ 2 ప్రకారం, ఆసరా పెన్షన్ లబ్ధిదారుల వయోపరిమితిని 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39 లక్షల మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉండగా, 11 లక్షల మంది కొత్త లబ్ధిదారులు వయో అర్హత ప్రమాణాలకు సరిపోతారని బండి సంజ‌య్ చెప్పారు. గత 39 నెలలుగా 78,624 మందికి అందించాల్సిన పథకాన్ని ప్రభుత్వం ఇంతవరకు ప్రారంభించలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు కసరత్తు ప్రారంభం కాలేద‌ని పేర్కొన్నారు. 

అసలైన లబ్ధిదారుడు చనిపోవడంతో దాదాపు రెండు లక్షల కుటుంబాలు ఆసరా పథకానికి దూరమయ్యాయని ఆరోపిస్తూ.. అర్హులైన వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం పింఛ‌న్ ప‌థ‌కంలో చేర్పించాలని బండి సంజయ్ కుమార్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. వయోపరిమితి సడలింపు నేపథ్యంలో అర్హులందరికీ పింఛను అందేలా కొత్త మార్గదర్శకాలను జారీ చేయాలని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. ఆసరా పింఛను పొందుతున్న వ్యక్తి మరణిస్తే, అతని లేదా ఆమె కుటుంబంలోని మరొక అర్హత గల సభ్యుడు పింఛను పొందడం కొనసాగించాలని ఆయన అన్నారు.

"ఒక కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఆసరా పెన్షన్‌కు అర్హులని నిర్ణయించడం తీవ్ర అన్యాయం. ప్రభుత్వం తీసుకున్న ఈ బుద్ధిహీన నిర్ణయం వల్ల రెండు లక్షల మందికి పైగా పేదలు పింఛన్‌కు దూరమయ్యారు. తాజాగా అర్హులైన 11 లక్షల మంది పెన్షనర్లకు ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలని" బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

అంత‌కు ముందు మీడియాతో మాట్లాడిన బండి సంజ‌య్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసే టీఆర్‌ఎస్‌ రౌడీలపై పోలీసు అధికారులు కేసులు పెట్టడం లేదని, బీజేపీ నేతల ఫిర్యాదుల‌ను తీసుకోవ‌డం లేదని ఆరోపించారు. ఎల్లారెడ్డిపేట ఘటనలో అరెస్టు అయి విడుదలైన 23 మంది బీజేపీ కార్యకర్తలను ఎంపీ క్యాంపు కార్యాలయంలో సన్మానించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

 బీజేపీ శ్రేణులను టార్గెట్ చేసుకుని టీఆర్ఎస్‌ గుండాలు రేచ్చి పోతున్నారనీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో జరిగిన ఘటన కూడా అలాంటిదేనన్నారు. ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారనీ , దాదాపు 27 మందిపై అక్రమ కేసులు పెట్టి , అందులో 23 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారని పేర్కొన్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ ల అక్రమ అరెస్టుల కు బీజేపీ శ్రేణులు భయపడవ‌ని చెప్పారు. జైలు ,అరెస్టుల తో బీజేపీని అడ్డుకోవాలనుకోవడం టీఆర్ఎస్ ప్రభుత్వ మూర్ఖత్వమ‌ని మండిప‌డ్డారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో పోలీసుల సాక్షిగా జరిగిన ఈ సంఘటనలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించి, కేవలం బీజేపీ శ్రేణుల పై అక్రమ కేసులు బనాయించి అరెస్టుచేసి రిమాండ్ కు తరలించడం సరికాదన్నారు. సంఘటనలో ఎల్లారెడ్డిపేటకు చెందిన లక్ష్మారెడ్డి తీవ్ర గాయాలపాలై నడవలేని పరిస్థితిలో ఉండడం బాధాకరమన్నారు.