‘‘నన్ను ఓడిస్తే వారికి.. బంగారు కంకణం తొడుగుతా’’
స్పీకర్ మధుసూదనాచారి ఓపెన్ ఛాలెంజ్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో తనను ఓడించేవారికి స్వర్ణకంకణధారణ, క్షీరాభిషేకం చేస్తానని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. పోచంపల్లిలో జరిగిన పల్లె ప్రగతినిద్రలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘భూపాలపల్లి నియోజకవర్గంలో కనీసం కొన్ని గ్రామాల పేర్లు తెలియని వారు కూడా అవాకులు, చావాకులు పేలుతున్నారు.. తస్మాత్ జాగ్రత్త..’’ అని హెచ్చరించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. సీమాంధ్ర నాయకులు ఎన్నికుట్రలు పన్నినా మొక్కవోని ధైర్యంతో ఉద్యమించి తెలంగాణ సాధించామన్నారు. 70 ఏళ్లలో చేయని అభివృద్ధి నాలుగేళ్లలో చేశామన్నారు. ప్రజలను మోసం చేసేందుకు గ్రామాల్లో తిరుగుతున్న కొంతమంది నాయకులను నమ్మి మోసపోవద్దని స్పీకర్ పేర్కొన్నారు.