నాయినికి షాక్: ముషీరాబాద్ ముఠా గోపాల్కు, కోదాడ బొల్లందే
కోదాడ, ముషీరాబాద్ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను టీఆర్ఎస్ ఆదివారం నాడు ప్రకటించింది
హైదరాబాద్: కోదాడ, ముషీరాబాద్ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను టీఆర్ఎస్ ఆదివారం నాడు ప్రకటించింది. టీడీపీ నుండి రెండు రోజుల క్రితమే టీఆర్ఎస్ లో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్ కు కోదాడ టికెట్టును కేటాయించింది. ముషీరాబాద్ టికెట్టును ముఠా గోపాల్ కు ప్రకటించింది.
ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డిని టీఆర్ఎస్ టికెట్టును కోరుకొన్నారు. కానీ, చివరకు కేసీఆర్ ముఠా గోపాల్ వైపు మొగ్గు చూపారు.
గతంలో ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి నాయిని నర్సింహ్మరెడ్డి విజయం సాధించారు. అయితే ఈ స్థానం నుండి ఈ దఫా తన అల్లుడికి టికెట్టు ఇవ్వాలని నాయిని కోరారు. కానీ, కేసీఆర్ మాత్రం ముఠా గోపాల్కు టికెట్టు ఇచ్చారు.
నాయిని నర్సింహ్మరెడ్డి అల్లుడు రామ్నగర్ కార్పోరేటర్గా విజయం సాధించారు. ఈ దఫా ముషీరాబాద్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. శ్రీనివాస్ రెడ్డికి టికెట్టు ఇప్పించేందుకు నాయిని నర్సింహ్మరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు.
రెండు రోజులుగా కేసీఆర్ ఈ విషయమై నాయిని నర్సింహరెడ్డిని బుజ్జగిస్తున్నారు. ఆదివారం నాడు కూడ కేసీఆర్ నాయిని నర్సింహ్మరెడ్డిని బుజ్జగించారు. నాయినిని ఒప్పించారు. సోమవారం నాడు నాయిని నర్సింహ్మరెడ్డి చేతుల మీదుగా ముఠా గోపాల్ భీ ఫామ్ ను అందుకొంటారు.
ముషీరాబాద్ లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ లక్ష్మణ్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో లక్ష్మణ్ బీజేపీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ దఫా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది.
మరోవైపు కోదాడ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ టికెట్టు ఆశించిన బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్టు రాలేదు. ప్రజా కూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కి కేటాయించింది. గత ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి టీడీపీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ పై విజయం సాధించారు. సిటింగ్ స్థానమైనందున కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని వదిలిపెట్టలేదు.
దీంతో బొల్లం మల్లయ్య యాదవ్ టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. రెండు రోజుల క్రితం కేటీఆర్ సమక్షంలో బొల్లం మల్లయ్య యాదవ్ టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.
2014 ఎన్నికల తర్వాత టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, కోదాడ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ శశిధర్ రెడ్డి పేర్లను టీఆర్ఎస్ పరిశీలించింది. అయితే చందర్ రావు, శశిధర్ రెడ్డి కంటే బొల్లం మల్లయ్య యాదవ్కే టీఆర్ఎస్ సర్వేలో అనుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో ఈ స్థానానికి ఇంత కాలం పాటు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదు.
పొత్తులో భాగంగా ఈ స్థానం టీడీపీకి దక్కితే బొల్లం మల్లయ్య యాదవ్ ఆ పార్టీ నుండే పోటీ చేసేవారు. కానీ, పొత్తులో భాగంగా ఈ స్థానం కాంగ్రెస్కు పోవడంతో బొల్లం మల్లయ్య యాదవ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీలో చేరగానే టీఆర్ఎస్ టికెట్టును ప్రకటించింది టీఆర్ఎస్.
సంబంధిత వార్తలు
నాయిని మొండిపట్టు: కేసీఆర్ కు తలనొప్పి ఇదీ...
అల్లుడికి హమీ ఇచ్చారు, ఆ సీటు నాకే కావాలి: నాయిని