తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేటీఆర్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేటీఆర్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఒంటిచేత్తో గెలిపించిన కేటీఆర్ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే కేటీఆర్ పార్టీపై, ప్రభుత్వంపై మరింత పట్టు సాధించే అవకాశం ఉంది. ఒకవేళ టీఆర్ఎస్కు వ్యతిరేక ఫలితాలు వస్తే కేటీఆర్పై కూడ ఆ ప్రభావం పడే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నిర్ణీత షెడ్యూల్ కంటే అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ ఎన్నికలకు వెళ్లారు. మరికొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ప్రజా కూటమి, టీఆర్ఎస్ నేతలు ముందస్తు ఏర్పాట్లు చేసుకొంటున్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కార్పోరేటర్ అభ్యర్థుల ఎంపికతో పాటు పార్టీ ప్రచారం ఇతరత్రా వ్యవహరాలన్నీ కేటీఆర్ చూసుకొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లను గెలుస్తామని కేటీఆర్ ప్రకటించారు.
కానీ, స్వంతంగా టీఆర్ఎస్ 99 సీట్లను కైవసం చేసుకొంది.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. కానీ, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించింది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడ కేటీఆర్ తనదైన ముద్ర వేశారు. అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారం, సర్వే ఇతరత్రా విషయాలపై కేటీఆర్ కీలకంగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి విజయం సాధిస్తే టీఆర్ఎస్లో కేటీఆర్ తిరుగులేని నాయకుడిగా చలామణి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ అంటూ పార్టీ శ్రేణులకు ధీమా వచ్చే అవకాశం లేకపోలేదు.టీఆర్ఎస్ లో హరీష్ రావు, కవితతో పాటు పార్టీలో సీనియర్లుగా ఉన్నవారి కంటే కేటీఆర్కు మరింత ప్రాధాన్యత పెరిగే అవకాశం లేకపోలేదు.
ఒకవేళ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు నెలకొంటే.. కేటీఆర్కు సీఎం పదవిని కట్టబెట్టే అవకాశం కూడ లేకపోలేదని కూడ ప్రచారంలో ఉంది. కేటీఆర్ సీఎంగా అయ్యేందుకు కూడ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్కు వ్యతిరేక ఫలితాలు వస్తే కేటీఆర్ భవిష్యత్తుపై నీలినీడలు నెలకొనే అవకాశాలు లేకపోలేదు.
అభ్యర్థుల ఎంపిక సందర్భంగా కొడా సురేఖ , బొడిగె శోభలు చేసిన ఆరోపణలకు మరింత ఊతమిచ్చేలా పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు ఉండే చాన్స్ లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన పార్టీ కూడ టీఆర్ఎస్పై ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించే అవకాశాలు కూడ ఉంటాయి. గత నాలుగేళ్లలో టీఆర్ఎస్ అనుసరించినట్టుగానే టీఆర్ఎస్కు చెందిన ముఖ్యనేతలు, ప్రజా ప్రతినిధులకు కాంగ్రెస్ వల వేసే అవకాశం లేకపోలేదు.
టీఆర్ఎస్ ఓడిపోతే పార్టీలో హరీష్ రావు వర్గం కూడ పార్టీపై పట్టుబిగించేందుకు ప్రయత్నాలు చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో హరీష్ రావు, కేటీఆర్ వర్గాలు ఉన్నాయని గతంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. పార్టీలో ఎలాంటి వర్గాలు, అభిప్రాయబేధాలు లేవని హరీష్ రావు, కేటీఆర్లు ప్రకటించినా కూడ సురేఖ వ్యాఖ్యలు మాత్రం ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా చేశాయి.
ఎన్నికలకు ముందు రాజకీయాలకు దూరంగా ఉండాలని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కూడ పార్టీలో అంతర్గత సమస్యలకు అద్దం పడుతోందని ఆ సమయంలో ప్రచారం సాగింది. పార్టీపై కేటీఆర్ పట్టు సాధించేందుకు చేసే ప్రయత్నాలకు హరీష్ వర్గం చెక్ పెట్టే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్కు పార్టీలో ఎదురే లేకుండా పోయే అవకాశం ఉంటుంది.కేటీఆర్ పార్టీలో అన్నీ తానై నడిపించే ఛాన్స్ కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.
ఎన్నికల సమయంలో కేటీఆర్ కారణంగానే తాను పార్టీని వీడినట్టుగా చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. కేటీఆర్పై అసంతృప్తిగా ఉన్న నేతలంతా కూడ ఈ అవకాశాన్ని తమకు అనకూలంగా మలుచుకొనే ఛాన్స్ లేకపోలేదు.
