Asianet News TeluguAsianet News Telugu

ఎన్నిక‌ల ఊపులో కాంగ్రెస్.. అధికార పార్టీ రెబ‌ల్స్ చేరిక‌ల‌తో మ‌రింత దూకుడు.. అధికార పీఠం దక్కించుకుంటుందా?

Hyderabad: అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన రెబల్స్ పార్టీలో చేరడంతో తెలంగాణ కాంగ్రెస్ కు ఎన్నిక‌ల ఊపుతో ముందుకు సాగుతోంది. గత కొన్ని రోజులుగా గతంలో బీజేపీ వైపే మొగ్గు చూపిన రెబల్ బీఆర్ఎస్ నేతలను కూడా ఆకర్షించడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో క‌ర్నాట‌క ఎన్నిక‌లు జోష్ ను తెలంగాణ‌లోనూ కొన‌సాగించ‌డానికి ప్ర‌త్యేక వ్యూహాల‌తో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది.
 

Telangana Assembly Election: Congress gets pre-poll boost RMA
Author
First Published Jun 18, 2023, 1:15 PM IST

Telangana Assembly Election-Congress: కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుండి అసమ్మతి నాయకులను ఆకర్షించడం ద్వారా తెలంగాణలో తన పునాదిని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదారు నెలల సమయం ఉన్న నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలతో దూకుడు పెంచిన బీజేపీపై ఆ పార్టీ పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. ఇటీవల బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి నేతల చేరికతో రెండు దఫాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా అవతరించిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత కొన్ని రోజులుగా గతంలో బీజేపీ వైపు మొగ్గు చూపిన రెబల్ బీఆర్ఎస్ నేతలను కూడా ఆకర్షించడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. కర్ణాటక ఫలితాల తర్వాత చాలా మంది నేతలు తమ మనసులోని మాటను బయటపెట్టారనీ, పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం కూడా నిత్యం చర్చల ద్వారా ప్రయత్నాలు చేసిందని రాజకీయ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ మరింత మంది నేతలను తన శిబిరానికి ఆకర్షించే అవకాశం ఉంది. బీఆర్ఎస్, బీజేపీకి చెందిన పలువురు అసమ్మతి నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ ను వీడిన వారు కూడా తిరిగి రావచ్చున‌ని ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు వివ‌రిస్తున్నాయి. 2014, 2018 ఎన్నికల్లో పరాజయాలు, ఫిరాయింపులు, ఉప ఎన్నికల్లో పేలవమైన పనితీరు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ బలమైన శక్తిగా ఉందని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని జిల్లాలకే పరిమితమైన బీజేపీకి భిన్నంగా కాంగ్రెస్ కు రాష్ట్రవ్యాప్తంగా బలమైన ఉనికి ఉంది. కొందరు నేతల ప‌రిస్థితు ప్ర‌భావ‌వంతంగా ఉండ‌క‌పోయినా.. కానీ పార్టీ శ్రేణులు ఇప్పటికీ క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తమ పార్టీలో చేరేందుకు సిద్ధపడటంతో కాంగ్రెస్ ఘన విజయం సాధించినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ ఇద్దరు నేతలను ఏప్రిల్ లో బీఆర్ ఎస్ సస్పెండ్ చేయగా, వారిని తమ శిబిరంలో చేర్చుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ చేరిక కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేతులెత్తేయడంతో బీజేపీ తన ప్రయత్నాల్లో విఫలమైందనే విషయం స్పష్టమైంది. ఇరువురు నేతలతో కొన్ని దఫాలుగా చర్చలు జరిపిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ను అధికారం నుంచి గద్దె దించడంలో తమతో చేతులు కలపాలని ఇరువురు నేతలు తనను ఒప్పించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తనను మంత్రివర్గం నుంచి తప్పించడంతో 2021లో బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, మరికొందరు నేతలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఇదే అంశం కాంగ్రెస్ పార్టీకి సైతం క‌లిసివ‌స్తున్న‌ద‌ని తెలుస్తోంది. 

కర్ణాటక ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత బీజేపీ శ్రేణుల్లో అసమ్మతి వార్తలు వెలువడ్డాయి. ఇది కూడా బీఆర్ఎస్ అసమ్మతివాదులను ఆకర్షించడానికి పార్టీ చేస్తున్న ప్రయత్నాలను దెబ్బతీసిందని చెప్పాలి. ఈ నెలాఖరులో ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సభకు మూడు లక్షల మందిని సమీకరించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఖమ్మంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో శ్రీనివాసరెడ్డి పలుకుబడి ఉన్న నేతగా పరిగణించబడుతున్నందున ఇది కాంగ్రెస్ కు సానుకూల అంశమ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ నెల 17న శ్రీనివాసరెడ్డితో కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చర్చలు జరిపారనీ, ఇద్దరు నేతలు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో ఫోన్ లో మాట్లాడారని తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను8 చోట్ల తన మద్దతుదారులకు టికెట్లు కేటాయించాలన్న శ్రీనివాసరెడ్డి డిమాండ్ ను కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ 10 స్థానాల్లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏడు స్థానాలు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రెండు స్థానాల్లో విజయం సాధించాయి. బీఆర్‌ఎస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు.

2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం నుంచి లోక్సభకు ఎన్నికైన శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరారు. బీఆర్ఎస్ నాయకత్వం అనేక హామీలు ఇచ్చిందని, కానీ వాటిని నెరవేర్చడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్ స‌భ‌ ఎన్నికల్లో కేసీఆర్ తనకు పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. జనవరి 18న ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభకు కూడా తనకు ఆహ్వానం అందకపోవడంతో ఆయన తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పేరు మార్చుకున్న తర్వాత బీఆర్ ఎస్ కు ఇదే తొలి సమావేశం కావడం గమనార్హం. పార్టీలో మరో కీలక చేరిక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుది. 2018లో మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో తనను ఓడించిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి మారడంతో ఆయనను టీఆర్ఎస్ లో పక్కన పెట్టారు. కొన్ని నెలల క్రితం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని హర్షవర్ధన్ రెడ్డికి కృష్ణారావు సవాల్ విసిరారు.

2011లో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కృష్ణారావు టీఆర్ఎస్ లో చేరి.. 2014లో కొల్లాపూర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. అయితే, ఇప్పుడు చేరికతో కొల్లాపూర్, వనపర్తి సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఉనికి పెరుగుతుందని భావిస్తున్నారు. మహబూబ్ నగర్ కు చెందిన మరికొంత మంది టీఆర్ ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. తెలంగాణ శాసనమండలి సభ్యుడు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఈ నెలాఖరులో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. కొడంగల్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గురునాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరనున్నారని టాక్. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి జిల్లాలోని ఇతర పార్టీల నేతలతో చర్చలు జరిపి వారిని కాంగ్రెస్ లో చేరేలా ఒప్పించడం ద్వారా టీపీసీసీ చీఫ్ గా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారు.

అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్ నియోజకవర్గానికి చెందిన కూచి శ్రీహరిరావు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. గతంలో టీడీపీలో, ఆ తర్వాత బీఆర్ఎస్ లో ఉన్న మరో సీనియర్ నేత నోముల ప్రకాశరావు కూడా కాంగ్రెస్ లో చేరారు. ఈ చేరికలు కాంగ్రెస్ కు పెరుగుతున్న బలానికి నిదర్శనమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ దుశ్చర్యలు, దుర్మార్గపు పాలనను భరిస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇవి కేవలం చేరికలు కాదని, ప్రజావ్యతిరేక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కబళించే వేవ్ అని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చేరిక‌లు కాంగ్రెస్ కు సానుకూలంగా ఉన్నా, ఎన్నిక‌ల స‌మయానికి ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తాయో చూడాలి.. ! 
 

Follow Us:
Download App:
  • android
  • ios