టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా, టీఆర్ఎస్లో చేరుతా: తేల్చేసిన ఎల్. రమణ
అంతా ఊహించినట్టే జరిగింది. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేశారు. నిన్న కేసీఆర్ తో రమణ భేటీ అయ్యారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ విషయాన్ని రమణ ఇవాళ ప్రకటించారు.
హైదరాబాద్: టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎల్. రమణ రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. గురువారం నాడు సీఎం కేసీఆర్ తో ఎల్. రమణ భేటీ అయ్యారు. తన రాజీనామా పత్రాన్ని శుక్రవారం నాడు చంద్రబాబునాయుడుు పంపారు రమణ.
also read:కేసీఆర్తో ముగిసిన భేటీ.. అనుచరులతో చర్చ తర్వాతే టీఆర్ఎస్లోకి : ఎల్ రమణ
కొంత కాలంగా టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరాలని ఎల్. రమణ భావిస్తున్నారు. రమణతో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు దఫాలుగా చర్చలు జరిపారు.ఈ చర్చలు ఫలవంతమయ్యాయి. దయాకర్ రావు దగ్గరుండి గురువారంనాడు రమణను కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు.
ప్రజలకు మరింత చేరువయ్యేందుు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకొన్నానని ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలని అనుకొంటున్నానని ఆయన చెప్పారు. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. 30 ఏళ్లుగా తనకు తోడ్పాటును అందించిన చంద్రబాబుకు ఆ లేఖలో ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ తెలంగాణ కన్వీనర్ గా కొనసాగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీడీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. రెండు టర్మ్లుగా ఆయన పనిచేస్తున్నారు.
తెలంగాణలో పలువురు టీడీపీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీని వీడి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరారు. ఇప్పటివరకు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రమణ కూడ ఆ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకొన్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎల్,. రమణ టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యత నెలకొంది.