ప్రగతి భవన్ పై టిడిపి రమణ సీరియస్ కామెంట్స్
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధినేత ఎల్. రమణ ప్రగతి భవన్ మీద సీరియస్ కామెంట్స్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో టిడిపి నేతలు ఎల్. రమణతోపాటు సండ్ర వెంకట వీరయ్య, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు వ్యవసాయ కమిషనర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
అనంతరం మీడియా తో ఎల్. రమణ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా కడగళ్ల వర్షం వల్ల వేల ఎకరాల్లో పంట నష్టపోతే కేసీఆర్ ప్రగతి భవన్ లో విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడని విమర్శించారు. పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన పంట వివరాలను ప్రభుత్వం వెంటనే సేకరించాలన్నారు. ప్రభుత్వ పెద్దలు వెంటనే క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సూచించారు. ఆత్మ హత్యలు చేరుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోక పోతే రైతు శవాలతో ప్రగతి భవన్ ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు.
మీడియాతో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట బీమా కూడా వచ్చే పరిస్థితి కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామి నాథన్ కమిషన్ ప్రకారం నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. బీమా కంపెనీలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో బీమా కంపెనీలు పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. అసెంబ్లీ లో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన రైతులకు మేలు జరగడం లేదన్నారు. కల్తీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందన్నారు.
టిడిపి సీనియర్ నేత రావుల చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపుల పై ఉన్న శ్రద్ధ రైతు సంక్షేమం పైన లేదని చురకలు వేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కనీస చర్యలు తీసుకొని ప్రభుత్వం తీరు దారుణంగా ఉందన్నారు. మూడు రోజుల్లో నష్ట నివారణ చర్యలు టీసుకుంటామని వ్యవసాయ శాఖ కమిషనర్ చెప్పారు. మూడు రోజుల్లో చర్యలు తీసుకోక పొతే తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన ఉద్యమం చేపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.