రాజకీయాల్లో బీసీలకు కేసీఆర్ అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్ధిగా ప్రకటించిన సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


హైదరాబాద్: రాజకీయాల్లో నవతరాన్ని సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.హుజూరాబాద్ లో గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్ధిగా ప్రకటించిన సీఎం కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బుధవారం నాడు టీఆర్ఎస్ భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

70 ఏళ్లలో జరగని అభివృద్ది కేసీఆర్ పాలనలో సాగుతుందన్నారు. ఇంటింటికి నల్లా నీళ్లు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఆయన చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డిపై ఈటల రాజేందర్ ను పోటీలో నిలిపిన సమయంలో కూడ రాజేందర్ దామోదర్ రెడ్డిపై గెలిచే అభ్యర్ధేనా అనే చర్చ జరిగిందని ఆయన గుర్తు చేసుకొన్నారు.

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డిపై నోముల భగత్ ను ప్రకటించిన సమయంలో కూడ ఇలానే అన్నారన్నారు. జానారెడ్డిపై భగత్ విజయం సాధించారని మంత్రి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దింపడంతో టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరని ఆయన చెప్పారు.

బడుగు,బలహీనవర్గాలతో పాటు నవతరాన్ని కూడ సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆయన చెప్పారు. పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గెల్లు శ్రీనివాస్ తల్లీదండ్రులు కూడ ప్రజా సేవలో ఉన్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.