సికింద్రాబాద్ లోకసభ సీటుపై కన్నేసిన తలసాని తనయుడు
సనత్ నగర్ నుంచి శాసనసభకు పోటీ చేసిన తన తండ్రి శ్రీనివాస్ యాదవ్ తరఫున సాయి కిరణ్ ప్రచారం కూడా చేశారు. సనత్ నగర్ లో పర్యటించినప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెవిలో తన తనయుడి కోరిక గురించి తలసాని వేసినట్లు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శాసనసభ్యుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్ సికింద్రాబాద్ లోకసభ సీటుపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన సాయి కిరణ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
సనత్ నగర్ నుంచి శాసనసభకు పోటీ చేసిన తన తండ్రి శ్రీనివాస్ యాదవ్ తరఫున సాయి కిరణ్ ప్రచారం కూడా చేశారు. సనత్ నగర్ లో పర్యటించినప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెవిలో తన తనయుడి కోరిక గురించి తలసాని వేసినట్లు సమాచారం.
తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడి విషయాన్ని కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు విన్నవించినట్లు తెలుస్తోంది. దాంతో ఆ విషయంపై కేసీఆర్ తలసానితో చర్చించినట్లు చెబుతున్నారు.
నిజానికి, సికింద్రబాదులో నిలబెట్టడానికి తగిన అభ్యర్థి కోసం టీఆర్ఎస్ గాలిస్తోంది 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఈ స్థానంలో నాలుగో స్థానంలో నిలిచింది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో బిజెపి నుంచి పోటీ చేసిన బండారు దత్తాత్రేయ విజయం సాధించారు.
గత ఎన్నికల్లో తమ అభ్యర్థిగా భీంసింగ్ ను టీఆర్ఎస్ దింపింది. అయితే, ఈసారి సమర్థుడైన అభ్యర్థిని దింపాలనే ఆలోచనలో ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ సికింద్రాబాదు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ఏడు శాసనసభ స్థానాల్లో ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది.
అయితే ఈసారి ఆరు సీట్లను టీఆర్ఎస్ గెలుచుకోగా, మజ్లీస్ ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. మజ్లీస్ ఈసారి సికింద్రాబాదు నుంచి పోటీ చేయడం లేదు. దీంతో అది టీఆర్ఎస్ కు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.